నెల్లూరు నగరంలోని బార్కాస్ సెంటర్లోని నూరు-ఏ-మదీనా మసీదు వద్ద నిర్వహించిన రంజాన్ ఇఫ్తార్ విందులో జనసేన నాయకులు కిషోర్ గునుకుల గారు పాల్గొన్నారు.
మసీదు కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు హాజరైన ఆయన, ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి వారి ఆనందంలో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా కిషోర్ గునుకుల గారు మాట్లాడుతూ…
“పవిత్ర రంజాన్ మాసం మొదలు నుంచి మా ముస్లిం సోదరుల నోరూరించే స్వీట్లు, విందు మాకు గుర్తు. కఠోర నియమాలతో ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు వారి త్యాగాలకు, ఓపిక, సహనం, నిబద్ధతకు మారు పేర్లు” అని పేర్కొన్నారు.
ఈ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు చేసే ప్రతి ప్రార్థన ఫలించాలని, దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రంజాన్ రోజుల్లో ప్రేమతో అందించే వంటకాల రుచి ప్రత్యేకమని, తాను ప్రతి సంవత్సరం వాటిని ఆస్వాదిస్తుంటానని తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వం ఇమాములు, మసీదులకు ₹43 కోట్ల నిధులు ప్రకటించడం అభినందనీయమని, ఇది ముస్లిం సోదరులకు సంఘీభావాన్ని చాటుతుందని అన్నారు.
కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నూరు-ఏ-మదీనా మసీదు వద్ద ఇఫ్తార్ విందులో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ మసీదు ద్వారా యువతకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయం అని, సమాజ శ్రేయస్సు కోసం ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలని కోరారు.
దేశంలో కొంతమంది దుష్టశక్తులు తప్పితే, భారతదేశం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, సామాన్య ప్రజలు సోదరభావంతో ప్రతి పండుగను కలిసి జరుపుకుంటున్నారని తెలిపారు.
రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ముందస్తుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.