చుంచుపల్లి : పేద, బడుగు, బలహీనవర్గాల సంక్షేమం, కార్మికవర్గ శ్రేయస్సుకోసం తుదిశ్వాస వరకు పరితపించిన బందెల నర్సయ్య అన్నివర్గాలకు ఆత్మీయ నేతగా చిరస్థాయిగా నిలిచిపోతాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, డిహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వర్కర్స్ యూనియన్ సీనియర్ నేత బందెల నర్సయ్య సంతాప సభ ఆయన స్వగృహం రుద్రంపూర్లో ఆదివారం జరిగింది. తొలుత సిపిఐ నాయకులు, కార్యకర్తలు వివిధ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు బందెల చిత్రపఠం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కూనంనేని మాట్లాడుతూ వర్కర్స్ యూనియన్ దివంగత నేత యూనియన్ కొమురయ్య అనుచరుడిగా సింగరేణి కార్మికవర్గానికి ఎనలేని సేవలందించాడని, సిపిఐ, ప్రజా సంఘాల భాద్యుడిగా సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్మించి ప్రజా సమస్యల పరిష్కారించిన ఘనత బందెలకు దక్కుతుందన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో పార్టీ విస్తరణకు అనునిత్యం కృషి చేశాడని కొనియాడారు. ప్రజా, కార్మిక ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించే నర్సయ్యను కోల్పోవడం ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. పార్టీ, ప్రజాసంఘాల్లో నాయకుడిగా కొనసాగుతూ నిస్వార్ధంగా సేవలందించారని, నిరాడంబరుడుగా నర్సయ్య జీవితం కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆదర్శమన్నారు. ఇలాంటి మహానేతను కోల్పవడం బాధాకరమని, ఆయన్ను ఆదర్శంగా తీసుకొని నేటితరం నాయకులు, కార్యకర్తలు ప్రజా జీవితానికి అంకితం కావడం ద్వారా పార్టీని ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, డిహెచ్ పీఎస్ రాష్ట్ర నాయకులు మారుపాక అనిల్, ఏసురత్నం, లక్ష్మణ్, సుధాకర్, వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కె రాజ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, కే సారయ్య, చంద్రగిరి శ్రీనివాసరావు, లక్ష్మికుమారి, నరాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివాస్, డి శంకర్, రామంజనేయులు, కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు, కోనేరు సత్యనారాయణ, సీపీఐ నాయకులు డి శేషయ్య, వి.మల్లికార్జున్ రావు, వాసిరెడ్డి మురళి, వి.పూర్ణచందర్ రావు, జి వీరస్వామి, కె జమలయ్య, మునిగడప వెంకటేశ్వర్లు, భూక్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.