ప్రజల హక్కుల పరిరక్షణకు SSAC కమిటీ ఏర్పాటు
ఫోరం ఫర్ RTI అండ్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు
విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో ఫోరం ఫర్ RTI అండ్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (రిజిస్ట్రేషన్ నెం. 367/2025) ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కీలక సమావేశం జాతీయ చైర్మన్ డా. కొమోజు రమేష్ అధ్యక్షతన నిర్వహించబడింది. రాష్ట్ర అధ్యక్షుడు పంగులూరి బుచ్చిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. కాకమాను వెంకట వేణు తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో సమాచార హక్కు చట్టం (RTI), మానవ హక్కుల పరిరక్షణ, న్యాయ అవగాహన, మహిళా మరియు యువజన సాధికారత, మీడియాతో సమన్వయం, అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన మార్గదర్శకత్వం కల్పించడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి పలు కీలక తీర్మానాలను ఆమోదించారు.
ఈ సందర్భంగా సంస్థకు విధానపరమైన సూచనలు, న్యాయ సలహాలు, వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందించేందుకు రాష్ట్ర వ్యూహత్మక సలహా మండలి State Strategic Advisory Committee (SSAC) ను ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ కమిటీలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సభ్యులుగా ఎంపిక చేశారు.
SSAC కమిటీ సభ్యులుగా ఎంపికైనవారు:
కౌర వెంకటేశ్వర్లు – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, తణుకు
సిద్ధ లోవరాజు – IIT-JEE కెమిస్ట్రీ లెక్చరర్, అనకాపల్లి
వి.వి. రంగనాథ్ – సీనియర్ మార్కెటింగ్ హెడ్, పోరంకి
సురేష్ బాబు – ఉపాధ్యాయుడు, ఉయ్యూరు
టి. సత్యనారాయణ – సీనియర్ సామాజిక సేవా మరియు రాజకీయ విభాగ ప్రతినిధి, తణుకు
అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో సంస్థ విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. RTI అవగాహన హ్యాండ్బుక్ ప్రచురణ, అవగాహన సదస్సులు, శిక్షణా కార్యక్రమాలు, మానవ హక్కుల పరిరక్షణపై ప్రత్యేక కార్యక్రమాలు, యువతకు నాయకత్వ శిక్షణ, ప్రజా సమస్యలపై న్యాయ సలహా కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలను సమావేశం ఆమోదించింది.
సంస్థ కార్యకలాపాల్లో పారదర్శకతను మరింత బలోపేతం చేయాలని సమావేశం నిర్ణయించింది.
ఈ సందర్భంగా జాతీయ చైర్మన్ డా. కొమ్మోజు రమేష్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాచార హక్కు మరియు మానవ హక్కులు ప్రతి పౌరుడికి అత్యంత విలువైన హక్కులని పేర్కొన్నారు. ప్రజలు తమ హక్కులను తెలుసుకొని చట్టబద్ధంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. RTI చట్టం ద్వారా ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందుతుందని, మానవ హక్కుల పరిరక్షణ ద్వారా సమాజంలో న్యాయం, సమానత్వం మరియు బాధ్యతాయుతమైన పరిపాలన బలోపేతం అవుతాయని అన్నారు.
వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి SSAC కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా సంస్థ మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాల పరిరక్షణ, చట్టపరమైన అవగాహన, పారదర్శక పాలన మరియు సుపరిపాలన కోసం సంస్థ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
చివరగా రాష్ట్రంలోని మేధావులు, న్యాయ నిపుణులు, ఉపాధ్యాయులు, మీడియా ప్రతినిధులు, యువత మరియు సామాజిక కార్యకర్తలు సంస్థ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
“ప్రజల హక్కుల పై అవగాహనా , పారదర్శక పాలన సాధన, మానవ హక్కుల అవగాహనా మా సంస్థ ప్రధాన ధ్యేయం” అని డా. కొమ్మోజు రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బుచ్చిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట వేణు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు టి సత్యనారాయణ, విద్యావేత్తలు,న్యాయ సలహా నిపుణులు, సాంకేతిక పరిజ్ఞాన నిపుణులు తదితరులు పాల్గొన్నారు