కోర్టు తీర్పులు అమలు చేయండి.. న్యాయం చేయండి: క్రిష్టప్ప కుటుంబం
కోర్టు ఆదేశాలు ఉన్నా న్యాయం ఎప్పుడు?
గోరంట్ల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న క్రిష్టప్ప కుటుంబం
గోరంట్ల, శ్రీ సత్యసాయి జిల్లా:
పులగూర్లపల్లి గ్రామ పరిధిలోని వడిగేపల్లి భూమి వివాదంలో ఆర్డీవో కోర్టు, జాయింట్ కలెక్టర్ కోర్టులు తమకు అనుకూలంగా తీర్పులు ఇచ్చినా ఇప్పటికీ న్యాయం జరగడం లేదని మాల క్రిష్టప్ప కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయమై గురువారం గోరంట్ల తహసీల్దార్ (ఎంఆర్వో)ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన తహసీల్దార్, "ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. గతంలో అప్పటి తహసీల్దార్ రంగనాయకులు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి కొత్తగా మీకు పాసుపుస్తకాలు జారీ చేసే అధికారాలు నాకు లేవు. ఆ అధికారం పైస్థాయి అధికారులకు లేదా కోర్టుకే ఉంటుంది. మీరు హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కాబట్టి ప్రస్తుతం నేను ఎలాంటి చర్యలు తీసుకోలేను" అని తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
దీనిపై క్రిష్టప్ప కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "రెండు కోర్టులు మా పక్షాన తీర్పులు ఇచ్చినా న్యాయం జరగడం లేదు. కోర్టు ఆదేశాలు అమలు కాకపోతే మేము ఇంకెవరి వద్దకు వెళ్లాలి? చివరకు తిరిగి రెవెన్యూ అధికారుల వద్దకే రావాల్సి వస్తోంది. ఏళ్ల తరబడి కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇప్పటికే లక్షల రూపాయలు ఖర్చు చేశాం. అయినా సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు" అని వాపోయారు.
"మమ్మల్ని మాత్రమే కాకుండా గోరంట్ల మండల ప్రజలను కూడా కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ అమలు చేయకపోవడం బాధాకరం. ఈ అంశాన్ని జిల్లా ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకొని మాకు న్యాయం చేయాలి" అని క్రిష్టప్ప కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
ఈ వ్యవహారంపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010