డబ్బులొస్తాయో లేదో కానీ. చెత్త మాత్రం గ్యారెంటీ! ఆళ్లగడ్డ SBI, ATM కథనం.
AIMA న్యూస్ నంద్యాల జిల్లా.. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు "స్వచ్ఛ భారత్" అంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తుంటే. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ నినాదాలు ఎక్కడా కనిపించడం లేదు. ఆళ్లగడ్డ పట్టణంలోని మినీ థియేటర్ సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎం కేంద్రమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
మంగళవారం నాడు నగదు ఉపసంహరణ కోసం వెళ్లిన వినియోగదారులు ఏటీఎం లోపల ఉన్న దుస్థితిని చూసి ముక్కున వేలేసుకున్నారు. ఎక్కడ చూసినా పాత రసీదులు, ప్లాస్టిక్ కవర్లు, మట్టితో కూడిన చెత్తాచెదారం పేరుకుపోయి, ఏటీఎం కాస్తా చెత్తకుండీని తలపిస్తోంది.
"స్వచ్ఛత గురించి పేపర్లలో, టీవీల్లో యాడ్స్ ఇచ్చే బ్యాంకులు. కనీసం తమ ఏటీఎం రూమ్లను శుభ్రంగా ఉంచాలనే కనీస బాధ్యతను మరచిపోయారు. డిజిటల్ సేవల పేరిట రకరకాల ఛార్జీలు వసూలు చేస్తున్న SBI, నిర్వహణను గాలికొదిలేసింది" అని ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పట్టణంలో ఎంతో రద్దీగా ఉండే ఈ ఏటీఎం కేంద్రానికి ప్రజలు వస్తుంటారు. ఇప్పటికైనా సంబంధిత బ్యాంక్ ఉన్నతాధికారులు స్పందించి, కేవలం ప్రచారాలకే పరిమితం కాకుండా, తక్షణమే ఈ ఏటీఎం కేంద్రాన్ని శుభ్రం చేయించి నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.