logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

దేవాలయాల్లో వీఐపీ సంస్కృతిపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఆలయాల్లో వీఐపీ సంస్కృతిపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భగవంతుడు ఒక్కడే వీఐపీ అని.. ఎవరి కోసమూ ఆయన వేచి ఉండరని స్పష్టం చేసింది. అంతేకాదు, ఎప్పుడు పడితే అప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లడానికి వీల్లేదని, దేవుడి ముందు అందరూ సమానమేనని తేల్చిచెప్పింది.
దేవాలయాల్లో ప్రత్యేక, పెయిడ్ దర్శనాలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ వి లక్ష్మీనారాయణన్‌ల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు, కొత్తగా పెళ్లైనవారు తప్ప మిగతావారికి ప్రత్యేక మర్యాదలు వద్దని పిటిషనర్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వీఐపీల కోసం సామాన్యులను క్యూ లైన్లలో గంటల తరబడి నిలబెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ప్రజాప్రతినిధులు, మంత్రులు తాము ప్రత్యేకమని భావించవద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎక్కువ మొత్తంలో వసూలు చేసి స్పెషల్ దర్శనాలు కల్పించడం రాజ్యాంగంలోని సమానత్వ హక్కును (ఆర్టికల్ 14 ప్రకారం) ఉల్లంఘించడమేనని ఉద్ఘాటించింది. వీఐపీ కల్చర్, పెయిడ్ దర్శనాల రద్దుపై వైఖరి చెప్పాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మే 15న ఒక మంత్రి దర్శనం కోసం తిరుపరంకుండ్రన్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని ఆలస్యంగా మూసివేశారా? అని కోర్టు గతంలో విచారించింది. ఆలస్యం కాలేదని చెప్పిన అదనపు అడ్వకేట్ జనరల్ వీవీ బాలసుబ్రహ్మణ్యం.. దానికి సంబంధించిన నివేదికను శుక్రవారం సమర్పించారు. కౌంటర్ దాఖలకు కూడా ఏఏజీ సమయం కోరారు. ఆ అభ్యర్థనను అంగీకరిస్తూ అనంతరం విచారణను 6 వారాల పాటు వాయిదా వేసింది.

విశ్వ హిందూ పరిషత్, ఉత్తర తమిళనాడు విభాగం అధ్యక్షుడు పి. చోకలింగం ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. సనాతన ధర్మం కులం లేదా భౌతిక సంపద ఆధారంగా వివక్ష చూపదని చోకలింగం వివరించారు. సనాతన ధర్మం అందరూ సమానులేనని, ధనిక, పేదల మధ్య ఎలాంటి వివక్ష ఉండకూడదని బోధిస్తుందని ఆయన తెలిపారు. హెచ్‌ఆర్ అండ్ సీఈ చట్టంలో గానీ, ఏ హిందూ గ్రంథాలలో గానీ అదనపు రుసుం చెల్లించి ప్రత్యేక దర్శనం చేసుకునేందుకు అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. అందువల్ల, ప్రత్యేక దర్శనం కోసం అధిక రుసుములను నిర్ణయించి భక్తులను దోపిడీ చేస్తున్నారని ఆయన వాదించారు.

''ప్రత్యేక దర్శనం పేరుతో ఆదాయాన్ని ఆర్జించడానికి, భక్తులను దోపిడీ చేయడానికి మన సనాతన ధర్మానికి చెందిన ఏ మత గ్రంథాలలోనూ ఒక్క అక్షరం కూడా కనిపించదు.. ఈ ప్రయోజనం కోసం వారిని దోచుకోవడానికి సృష్టించిన ఒక కొత్త కల్పన తప్ప ఇది మరేమీ కాదు'' అని పిటిషన్‌లో పేర్కొన్నారు.


2
136 views

Comment