రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలి
తేది:30.05.2026
కామారెడ్డి జిల్లా
శనివారం
రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతా ప్రమాణాల మెరుగుదల కోసం చేపడుతున్న చర్యలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులతో కలిసి రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలను సమీక్షించారు.
రహదారుల వెంబడి ఉన్న ఆక్రమణలు ప్రమాదాలకు దారితీస్తున్న నేపథ్యంలో వాటి తొలగింపుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా హైవేల వెంట ఉన్న హోటళ్లు, భోజనశాలలకు అనధికారికంగా ఏర్పాటు చేసిన ప్రవేశ మార్గాలను తొలగించి, నిబంధనల ప్రకారం మాత్రమే రాకపోకలు ఉండేలా చూడాలని ఆదేశించారు.
జాతీయ రహదారులపై వన్యప్రాణుల సంచారం కారణంగా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు జంతువుల అండర్పాస్ల నిర్మాణ ప్రతిపాదనలను వేగవంతం చేయాలని సూచించారు. అటవీ ప్రాంతంలో ప్రతిపాదిత ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన అనుమతులు త్వరితగతిన పొందేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి, అక్కడ భద్రతా సూచికలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వేగ నియంత్రణ కోసం రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయడంతో పాటు, మల్లుపేట, గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలు వంటి ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, షెవ్రాన్ మార్కింగ్లు మరియు ఇతర రహదారి భద్రతా సూచికలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రమాదాల నివారణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించే దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
ఈ సమావేశంలో రవాణా, పోలీస్, రోడ్లు-భవనాలు, జాతీయ రహదారుల సంస్థ, అటవీ శాఖ తదితర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.