మహానాడు జనసమీకరణలో సత్తా చాటిన తల్లీకొడుకులు పరిటాల సునీత, శ్రీరామ్.
AIMA న్యూస్ బ్యూరో.. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వర్చువల్ మహానాడులో అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల కుటుంబం తమ రాజకీయ పట్టును మరోసారి నిరూపించుకుంది. గురువారం నాడు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో కార్యకర్తలు రికార్డు స్థాయిలో తరలివచ్చారు. ప్రతి క్లస్టర్ పరిధి నుంచి వేలాది మంది చురుగ్గా పాల్గొనడంతో రాయలసీమ ప్రాంతంలోనే రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలు టాప్ ప్లేస్లో నిలిచాయి.రెండు రోజుల పాటు జరిగిన ఈ మహానాడులో కార్యకర్తల హాజరు శాతాన్ని బట్టి రాష్ట్రస్థాయి ర్యాంకులను ప్రకటించారు. ఇందులో రాప్తాడు నియోజకవర్గం రాష్ట్రంలోనే 5వ స్థానాన్ని కైవసం చేసుకోగా. రాయలసీమ రీజియన్లో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1800కు పైగా క్లస్టర్లలో రామగిరి-10వ క్లస్టర్ 7వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. మరోవైపు ధర్మవరం నియోజకవర్గం కూడా అదే స్థాయిలో సత్తా చాటి రాష్ట్రస్థాయిలో 8వ స్థానాన్ని సొంతం చేసుకుంది. కేంద్ర పార్టీ కార్యాలయం వేదికగా జరిగిన మహానాడులో రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ ఈ అధికారిక వివరాలను చదివి వినిపించారు.
రెండు నియోజకవర్గాలు రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలవడంపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ హర్షం వ్యక్తం చేశారు. గత పది రోజులుగా నాయకులు, కార్యకర్తలు రాత్రింబవళ్లు పడ్డ కష్టానికి దక్కిన ఫలితం ఇదని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో పార్టీ చేపట్టే ఎలాంటి కార్యక్రమాలకైనా ఇంతకు రెట్టింపు స్థాయిలో మా ప్రాతినిధ్యం ఉంటుందని వారు స్పష్టం చేశారు.
మహానాడు కార్యక్రమం విజయవంతంగా ముగిసిన అనంతరం అనంతపురం నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే పరిటాల సునీతకు కుటుంబ సభ్యులు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పరిటాల శ్రీరామ్, ఆయన సతీమణి జ్ఞాన, పరిటాల సిద్ధార్థలతో పాటు మనవళ్లు జూనియర్ పరిటాల రవీంద్ర, అమైరా రవీంద్రలు కేక్ కట్ చేయించి సునీతకు శుభాకాంక్షలు అందజేశారు. మహానాడు సక్సెస్ కావడం, అదే రోజున సునీత పుట్టినరోజు కావడంతో నియోజకవర్గాల ముఖ్య నాయకులు, కార్యకర్తల రాకతో పరిటాల నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది.