'చావనైనా చస్తాం కానీ.. మాట్లాడే హక్కును వదులుకోం'.. పవన్ కళ్యాణ్ విషయంలో తేల్చిచెప్పిన ప్రొఫెసర్ నాగేశ్వర్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ మధ్య చెలరేగిన వ్యవహారం.. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్రొఫెసర్ నాగేశ్వర్పై హైదరాబాద్ పెట్టిన కేసులకు వ్యతిరేకంగా ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ చేస్తారో, కేసులు ఉపసంహరించుకుంటారో మీ ఇష్టం.. మేము మాత్రం మాట్లాడుతూనే ఉంటామని.. మాట్లాడే హక్కును వదులుకోం అంటూ తేల్చి చెప్పారు. కావాలంటే టైమ్, ప్లేస్ చెప్పండి తానే వస్తానని.. అరెస్ట్ చేసుకోండి అంటూ ఏపీ సర్కార్కు సవాల్ విసిరారు. తనపై లేనిపోని సెక్షన్లు అన్నీ కలిపి కేసులు నమోదు చేశారని వెల్లడించారు. తాను భయపడే వ్యక్తిని కాదని ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పష్టం చేశారు.
చట్టపరమైన చర్యలకు గానీ.. అరెస్ట్లకు గానీ తాను భయపడనని ప్రొఫెసర్ నాగేశ్వర్ తేల్చి చెప్పారు. తాను 30 ఏళ్ల వయసులోనే ఎన్నో సవాళ్లు, అడ్డంకులను ఎదుర్కొని భయపడని తాను.. ఇప్పుడు 62 ఏళ్ల వయసులో ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనపై లేనిపోని నిందలు మోపారని ఆయన తీవ్రంగా ఖండించారు. సమాజంలో కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నానని కేసు పెట్టారని.. అల్లర్లు రేపేందుకు తాను ప్రయత్నం చేస్తున్నానని తప్పుడు కేసులు పెట్టారని పేర్కొన్నారు. తాను చిచ్చు పెడితే.. గత 10 రోజుల్లో ఏం అల్లర్లు జరిగాయని ప్రశ్నించారు.