ప్రధాని మోడీతో సిఎం విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత జోసెఫ్ విజయ్ బుధవారం సేవా తీర్థంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. సిఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్లిన విజయ్..మర్యాదపూర్వకంగా ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా, అనైమంగళం రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలకు గానూ సిఎం విజయ్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి ఇటీవల నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా ఈ చారిత్రక కళాఖండాలు లభ్యమయ్యాయి.
శ్రీలంక సమీపంలోని సముద్రంలో తమిళనాడు మత్స్యకారులకు సంబంధించి పదేపదే జరుగుతున్న సంఘటనలపై సిఎం విజయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2026లో ఇప్పటివరకు 12 అరెస్టు సంఘటనలు జరిగాయని ఆయన ప్రధాని మోడీకి తెలియజేశారు. ప్రస్తుతం 58 మంది మత్స్యకారులు శ్రీలంక అదుపులో ఉన్నారని, 266 చేపల పడవలను స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని శ్రీలంక ప్రభుత్వంతో ప్రస్తావించి, నిర్బంధంలో ఉన్న మత్స్యకారులను, వారి పడవలను తక్షణమే విడుదల చేయాలని ఒత్తిడి తేవాలని విజయ్ ప్రధానిని కోరారు.
విజయ్ ఢిల్లీలోని తమిళనాడు హౌస్ను కూడా సందర్శించారు. అక్కడ ఆయనకు లాంఛనప్రాయ గౌరవ వందనం లభించింది. కాగా.. మంగళవారం, కావేరీ నదిపై మేకెదాటు ఆనకట్ట నిర్మాణాన్ని కర్ణాటక ప్రభుత్వం చేపట్టకుండా కేంద్రాన్ని నిరోధించాలని కోరుతూ విజయ్ ప్రధానికి లేఖ రాశారు.