నంద్యాల జిల్లా కలెక్టర్ వినూత్న చొరవ. ఇంధన పొదుపు చేస్తూ ప్రజా సమస్యల చెంతకు!
AIMA న్యూస్ నంద్యాల జిల్లా.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంధన పొదుపు చర్యలను ప్రోత్సహిస్తూ, ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా నంద్యాల జిల్లా యంత్రాంగం వినూత్నంగా కదిలింది. శనివారం నాడు వన్ మంత్ – ఫోర్ విజిట్ కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ నియోజకవర్గ కేంద్రంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు.ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ (PGRS) ఆవరణ నుండి జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్. మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు అందరూ కలిసి ఒకే బస్సులో ఆళ్లగడ్డకు బయలుదేరి వెళ్లడం జరిగింది. అధికారులందరూ వ్యక్తిగత వాహనాలను పక్కన పెట్టి, ఇలా ఒకే బస్సులో ప్రయాణించడం ఇంధన పొదుపుపై ప్రజల్లో మంచి సందేశాన్ని ఇచ్చింది.
ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన “వన్ మంత్ - ఫోర్ విజిట్” రెండో వారం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్థానిక ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ తో కలిసి వారు ప్రజల నుండి నేరుగా వినతులు, ఫిర్యాదులు, సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ, ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను, సమస్యలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా, చట్టపరిధిలో అత్యంత వేగంగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను తక్షణమే ఆదేశించారు. ప్రజా సమస్యల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.తమ సమస్యలను నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నియోజకవర్గ నలుమూలల నుండి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో ఈ వేదికకు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, నియోజకవర్గ స్థాయి అధికారులు, మండల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.