బి.శోభా దేవికి కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం
హనుమకొండ జిల్లా,హసన్పర్తి మండలం, భీమారం గ్రామానికి చెందిన బూర శోభా దేవి కాకతీయ విశ్వవిద్యాలయం నుండి తెలుగు విభాగంలో పిహెచ్.డి (డాక్టరేట్) పట్టా పొందారు. తెలుగు శాఖ సీనియర్ ఆచార్యులు పంతంగి వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఆమె "నల్లగొండ జిల్లా కథా సాహిత్యం" అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను ఈ డాక్టరేట్ లభించింది. ఈ మేరకు శోభా దేవి పిహెచ్.డి పూర్తి చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కట్ల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
గతంలో తెలుగు విభాగంలో ఎం.ఏ (పీజీ)లో రెండు బంగారు పతకాలు (గోల్డ్ మెడల్స్) సాధించిన శోభా దేవి, ప్రస్తుతం కమలాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ బూర శోభా దేవి మాట్లాడుతూ తన పరిశోధనకు సహకరించిన కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే. ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వీ. రామచంద్రం, ఆర్ట్స్ డీన్ ఆచార్య సురేష్ లాల్,తన సిద్ధాంత గ్రంథ పర్యవేక్షకులు ఆచార్య పంతంగి వెంకటేశ్వర్లు గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కాగా, డాక్టరేట్ సాధించిన శోభా దేవిని తెలుగు శాఖాధిపతి డాక్టర్ లింగయ్య, బి.ఓ.ఎస్ చైర్మన్ & కేయూ పాలక మండలి సభ్యులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్, అధ్యాపకులు డాక్టర్ కర్రె సదాశివ్, డాక్టర్ కోమల, డాక్టర్ స్వామి నాయక్, డాక్టర్ ఆగపాటి రాజు, మరియు తెలుగు విభాగం సిబ్బంది,పరిశోధకులు, విద్యార్థులు శోభా దేవికి శుభాకాంక్షలు తెలిపారు.