37 సెంట్లలో వెదురు సాగు.. ఏటా లక్ష ఆదాయం!
AIMA న్యూస్ నంద్యాల జిల్లా.. డ్వాక్రా సంఘాలలోని మహిళా రైతులు ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి వెదురు పంట సాగు ఒక అద్భుతమైన అవకాశమని డ్వాక్రా సంఘాల జిల్లా అధికారులు పేర్కొన్నారు. ‘ఇండస్-ట్రీ’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రోజున ఆళ్లగడ్డ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని డ్వాక్రా మండల సమైక్య కార్యాలయంలో సీసీలకు, డ్వాక్రా సంఘాల నాయకురాలకు వెదురు సాగుపై ఒక ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి డ్వాక్రా సంఘాల జిల్లా అధికారి రంగారావు, నాయక్, ఫారమ్ ఏపీఎం సురేష్, ఆళ్లగడ్డ మండల డ్వాక్రా ఏపీఎం విజయ్ గోపాల్ లు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఇండస్-ట్రీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ప్రసంగి మాట్లాడుతూ మహిళా రైతులు తమకున్న భూమిలో కేవలం 37 సెంట్లలో 60 వెదురు మొక్కలను నాటుకోవడం ద్వారా అద్భుతమైన లాభాలను గడించవచ్చని వివరించారు. ఈ పంటను సాగు చేసిన మూడు సంవత్సరాల తర్వాత, ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయల వరకు అదనపు ఆదాయం పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు. వెదురు సాగు వల్ల భూమి వృథా కాదని, వెదురు మొక్కల మధ్యలో మిగిలే స్థలంలో ఇతర అంతర పంటలను కూడా సాగు చేసుకునే వీలుంటుందని దీనివల్ల మహిళా రైతులకు అదనపు లాభాలు చేకూరుతాయన్నారు.మహిళా రైతులు సాంప్రదాయ పంటలతో పాటు ఇలాంటి వాణిజ్య పంటల వైపు అడుగులు వేయాలి. క్షేత్రస్థాయిలో మహిళా రైతులకు వెదురు సాగుపై పూర్తి అవగాహన కల్పించి, వారు ఈ పంట వేసేలా ప్రోత్సహించాలి.
ఈ కార్యక్రమంలో డ్వాక్రాసంఘాల సీసీలు, వివిధ సంఘాలమహిళా ప్రతినిధులు, లీడర్లు తదితరులు పాల్గొన్నారు.