స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర: పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి పట్టణం తాలూకా సెంటర్ అన్నా కాంటీన్ వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, స్వచ్ఛాంధ్ర కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో చెత్తపై పన్ను వేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానిని తొలగించిందని గుర్తుచేశారు. పారిశుద్ధ్య కార్మికులకు కూటమి ప్రభుత్వం కోటి రూపాయల ప్రమాద బీమా కల్పిస్తోందని, ప్లాస్టిక్ నివారణకు ప్రజలు స్వచ్ఛందంగా చైతన్యంతో కట్టడి చేయాలని కోరారు. కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని, భూగర్భ జలాలు పెంచడంపై ప్రత్యేక ఫోకస్ పెడుతూ కాల్వలు, చెరువులు, చెక్ డ్యాంలను బాగు చేసుకుని నీటి నిల్వకు సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తానని, తోటి వారికి అవగాహన కల్పిస్తూ భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నా వంతు కృషి చేస్తానని అక్కడ ఉన్న అందరిచేత ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, వార్డు స్థాయి కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.