నేడు జగిత్యాలకు సమాచార కమీషన్ రాక
- జిల్లా కలెక్టరేట్ లో కేసుల విచారణ
నేడు జగిత్యాలకు సమాచార కమీషన్ రాక
జిల్లా కలెక్టరేట్ లో కేసుల విచారణ
జగిత్యాల జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ శనివారం జగిత్యాలకు రానున్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఉదయం పూట సమావేశం, మధ్యాహ్నం కేసుల విచారణ చేపట్టనున్నారు.
ప్రజలకు వజ్రాయుధం అయిన సమాచార హక్కు చట్టం - 2005 ద్వారా కార్యకర్తలు దాఖలు చేసిన రెండో అప్పీల్ కేసులపై తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ ఇరువర్గాలకు ముఖా - ముఖి విచారణ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన నోటీసులు వివిధ శాఖల అధికారులకు, సమాచార హక్కు చట్టం కార్యకర్తలకు పోస్ట్ ద్వారా ఇప్పటికే చేరి ఉన్నాయి. స్థానికంగా జిల్లా కలెక్టరేట్ లో జరుగనున్న సమాచార కమీషన్ సమావేశానికి, విచారణకు జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. నోటీసులు అందుకున్న వివిధ శాఖల అధికారులు పాత ఫైల్స్ తీసి సమాచారం ఇచ్చేందుకు వెతుకులాడుతున్నారు. కొన్ని శాఖల అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కొంత మంది అధికారులు తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ పంపించిన నోటీసులు పోస్ట్ ద్వారా స్వీకరించేందుకు సంశయం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.
జగిత్యాల జిల్లా ఏర్పడ్డ దశాబ్ద కాలం ( పది ఏండ్ల ) తర్వాత జిల్లా కేంద్రంలో మొట్ట మొదటి సారి తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ విచారణ చేపట్టడం పట్ల జిల్లాలోని ఆర్టీఐ కార్యకర్తలు, హక్కుల సంఘాల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ కు వారు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు. శనివారం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ లను స్వయంగా కలిసి వినతి పత్రాలు అందజేసేందుకు కొందరు ఆర్టీఐ కార్యకర్తలు సిద్ధపడుతున్నట్లు తెలిసింది.