జిల్లా యాదవ మహా సంఘం మహిళా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక: రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజ యాదవ్
నెల్లూరులోని ఆమని గార్డెన్స్ లో అఖిల భారత యాదవ మహా సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పెరుమాళ్ళ పద్మజా యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి విట్టపు లలితా రామ్ యాదవ్ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నెల్లూరు జిల్లా "మహిళా విభాగం కమిటీ"ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నూతన కమిటీ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఉడతా శైలజ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వరలక్ష్మీ యాదవ్, ఉపాధ్యక్షురాలుగా వెంకటసుబ్బమ్మ, జిల్లా కార్యదర్శిగా రాచమల్లు కవిత యాదవ్ ను నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి చైతన్యవంతమైన, విద్యావంతులైన మహిళలు, డాక్టర్లు, ఉపాధ్యాయులను ఎంపిక చేసి మహిళా విభాగాన్ని పటిష్టపరుస్తామని, యాదవ సామాజిక వర్గ ఐక్యత కోసం కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు ప్రొఫెసర్ డాక్టర్ సునీత శ్రీకాంత్ ను ఎంపిక చేశామని, త్వరలోనే పలనాడు, గుంటూరు, కర్నూలు, నంద్యాల, బాపట్ల, కృష్ణ, ఎన్టీఆర్ తదితర జిల్లాలకు కమిటీలను ప్రకటిస్తామన్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే 20 మండలాలకు కమిటీలను ఏర్పాటు చేశామని, జిల్లాలో సంఘ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు రాష్ట్ర అధ్యక్షుడు పేరయ్య యాదవ్తో మాట్లాడి త్వరలోనే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ను కూడా నియమిస్తామని స్పష్టం చేశారు. అలాగే, అఖిల భారత యాదవ మహా సంఘం జాతీయ క్రమశిక్షణ సంఘం చైర్మన్ పిన్నిక లక్ష్మీ ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులతో చర్చించి, దేవస్థానాలు మరియు యాదవ అన్న సత్రాల వద్ద సామాజిక వర్గానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు, మహిళా కోటా పెంచేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని, స్వార్ధపరుల నుండి హక్కులను కాపాడుకుంటూ ధైర్యంగా ముందుకు సాగుతామని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు యాదవ మహా సంఘం నేతలు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.