ఆళ్లగడ్డలో జిల్లా కలెక్టర్ పర్యటన: గ్రీవెన్స్ డే నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి.
AIMA న్యూస్ నంద్యాల జిల్లా.. ఆళ్లగడ్డ పట్టణ మరియు మండల పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, రేపటినుండి ప్రతి శుక్రవారం( నాలుగు వారాలు) ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా స్వయంగా హాజరుకానుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కిషోర్,ఎమ్మార్వో జ్యోతి రత్నకుమారి,ఎంపీడీవో షేక్ నూర్జాన్ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గతంలో జిల్లా కేంద్రానికి వెళ్లి తమ సమస్యలు చెప్పుకోలేని వారు, ఇప్పుడు తమ నియోజకవర్గ కేంద్రంలోనే నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకు రావచ్చని తెలిపారు. పట్టణంలోని డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం వంటి మున్సిపల్ సమస్యలతో పాటు. గ్రామీణ ప్రాంతాల్లోని భూ వివాదాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఉపాధి హామీ పథకం మరియు సంక్షేమ పథకాలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులపై ఈ గ్రీవెన్స్లో ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ రాక నేపథ్యంలో సాధ్యమైనంత వరకు అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని, సాంకేతిక కారణాలతో పెండింగ్లో ఉన్న వాటికి నిర్ణీత కాలపరిమితిని నిర్ణయించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గ్రీవెన్స్కు వచ్చే ప్రజల కోసం ప్రత్యేక షామియానాలు, తాగునీటి సదుపాయం కల్పించినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుదారులు తమ సమస్యకు సంబంధించిన పత్రాలతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతిని తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.
ప్రభుత్వ యంత్రాంగం నేరుగా ప్రజల వద్దకే వస్తున్నందున, సమస్యల పరిష్కారం కోసం ఎవరూ మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దని అధికారులు స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.