ఆళ్లగడ్డలో కూటమి భవిష్యత్తుపై జనసేన పార్టీ ఇన్చార్జ్ మైలేరి మల్లయ్య సంచలన వ్యాఖ్యలు.
AIMA న్యూస్ నంద్యాల జిల్లా.. పదవుల కోసం ప్రాకులాడే వ్యక్తిని కాదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నా కుటుంబంపై అనేక దాడులు జరిగినా, చివరకు గత ZPTC ఎన్నికల సమయంలో నా భార్యను వైసీపీ నేతలు కిడ్నాప్ చేసినా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఆళ్లగడ్డ లో జనసేన జెండాపట్టడం జరిగిందని నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య కంటతడితో పేర్కొన్నారు. శుక్రవారం రోజున ‘పవర్ 9’ ఛానల్ సీఈఓ బ్రహ్మనాయుడు నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మైలేరి మల్లయ్య పాల్గొని, నియోజకవర్గ రాజకీయాలపై నిప్పులు చెరిగారు. బ్రహ్మనాయుడు నాయుడు అడిగిన ప్రశ్నలకు మల్లయ్య ఎక్కడ తడబడకుండా మాట్లాడారు.వైసీపీ పాలనలో అనుభవించిన కష్టాలను గుర్తు చేసుకుంటూ. పార్టీ సిద్ధాంతం మీద నమ్మకంతో, ఆశయాల సాధన కోసం జనసేన ఆవిర్భావం నుంచే అండగా నిలబడ్డాను. నాడు నియోజకవర్గంలో జనసేన జెండా పట్టుకోవాలంటేనే భయపడే పరిస్థితులు ఉండేవి. అలాంటి గడ్డు కాలంలోనూ ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి, ఆళ్లగడ్డ గడ్డపై తొలిసారి జనసేన జెండా ఎగురవేసిన గర్వం నాకు ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన ముఖ్యాంశాలు, ఆళ్లగడ్డ నియోజకవర్గం, రుద్రవరం మండలం, చిత్రేనిపల్లి తన స్వగ్రామమని, ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నేను జనసేన పార్టీ పురుడు పోసుకున్న తొలి రోజుల్లో, అనేక ఒత్తిళ్లు ఎదురైనా బెదరకుండా పార్టీ కోసం పనిచేశానని గుర్తు చేసుకున్నారు.పవన్ కళ్యాణ్ ఆశయాల పట్ల ఉన్న గౌరవంతోనే నాటి నుంచి నేటి వరకు పార్టీ జెండాను భుజాన మోస్తున్నానని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఆళ్లగడ్డ జనసేన పార్టీలో ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి సమన్వయకర్తగా ఎదిగిన తన ప్రస్థానంలో ఎదురైన సవాళ్లను మల్లయ్య ఈ ఇంటర్వ్యూలో వివరించారు.గత ప్రభుత్వంలో మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. రాజకీయంగా ఎదుర్కోలేక నా భార్యను కిడ్నాప్ చేసే స్థాయికి దిగజారారు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఆశయం కోసం నిలబడ్డాను. ఇప్పుడు నా భార్య మైలేరి సురేఖ కు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవినీ అడ్డుకున్న మాత్రాన పార్టీ వీడను. నా కట్టే కాలే వరకు జనసేనలోనే ఉంటాను అని స్పష్టం చేశారు.చిన్నచూపు చూస్తే సహించేది లేదు.ప్రస్తుత పరిస్థితులపై స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలకు అవమానాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఏ పనులు అడిగినా నిర్లక్ష్యం చేస్తున్నారు. మమ్మల్ని చాలా తక్కువ చేసి చూస్తున్నారు. అధికారుల దగ్గర నుంచి గౌరవం లేకపోవడం, పనులు జరగకపోవడం కార్యకర్తలను బాధిస్తోంది అని మల్లయ్య పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తీరుపై స్పందించారు. ప్రస్తుతం మమ్మల్ని తక్కువ అంచనా వేస్తూ, విస్మరిస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కూటమి ధర్మాన్ని విస్మరించి, మమ్మల్ని కలుపుకొని పోని పక్షంలో.2029 ఎన్నికల్లో మీ ఓటమికి మీరే స్వయంగా కారణమవుతారు అని హెచ్చరించారు. పొత్తులో ఉన్న పార్టీలను, కార్యకర్తలను గౌరవించినప్పుడే రాజకీయ మనుగడ ఉంటుందని ఆయన హితవు పలికారు.
అధికారంలో ఉన్నా లేకపోయినా, పదవులు వచ్చినా రాకపోయినా ప్రజా సమస్యలే ఎజెండాగా తన ప్రయాణం కొనసాగుతుందని మల్లయ్య ప్రకటించారు. వైసీపీ అరాచకాలను ఎదిరించి నిలబడిన తమకు, ప్రస్తుత నిర్లక్ష్యం పెద్ద సమస్య కాదని, అయితే కార్యకర్తల ఆత్మగౌరవం విషయంలో రాజీ పడేది లేదని ఆయన తేల్చి చెప్పారు.