చదువుల గడ్డపై ప్రజ్ఞా జెండా: 594 మార్కులతో సత్తా చాటిన ఆళ్లగడ్డ విద్యార్థులు.
AIMA న్యూస్ నంద్యాల జిల్లా..ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రజ్ఞా హైస్కూల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో కనబరిచిన ప్రతిభ అమోఘమని, నియోజకవర్గ స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం గర్వకారణమని అపుస్మా (APUSMA) నియోజకవర్గం యూనిట్ అధ్యక్షులు టి. అమీర్ బాషా కొనియాడారు.ప్రజ్ఞా విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీమతి హేమలత రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రోజున పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి, అత్యధికంగా 594 మార్కులు సాధించిన షేక్ దుడియం మహమ్మద్ ఫయాజ్, కొర్రపాటి వైష్ణవిలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను బహుకరించి, వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ హేమలత రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల నిరంతర కృషి, తల్లిదండ్రుల సహకారం మరియు విద్యార్థుల ఏకాగ్రత వల్లే ఈ విజయం సాధ్యమైంది. కేవలం మార్కులే కాకుండా, విలువలతో కూడిన క్రమశిక్షణ మరియు దేశభక్తి కలిగిన ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే మా సంస్థ లక్ష్యం అని పేర్కొన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన అమీర్ బాషా మాట్లాడుతూ. ఆళ్లగడ్డను 'చదువుల గడ్డ'గా తీర్చిదిద్దడంలో ప్రజ్ఞా విద్యా సంస్థల పాత్ర అభినందనీయమన్నారు. రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
పాఠశాల హెడ్మాస్టర్ మహబూబ్ బాషా తన కుమారుడు ఫయాజ్ 594 మార్కులతో విజేతగా నిలవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, ఉపాధ్యాయులు అందించిన విజ్ఞాన సంపదే ఈ విజయానికి పునాది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.