వెలుగు ఆఫీస్ నందు ప్రకృతి వ్యవసాయంపై రెండు రోజుల శిక్షణా కార్యక్రమం.
మహానంది (మన ప్రజాపక్షం): బుక్కాపురం వెలుగు ఆఫీస్ నందు ప్రకృతి వ్యవసాయంపై మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై గ్రామ వ్యవసాయ మరియు ఉద్యాన సహాయకులకు మరియు ప్రకృతి వ్యవసాయ ఐ సి ఆర్ పి లకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం సిబ్బంది సిసింద్రీ మరియు అంజనమ్మ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం వలన వాతావరణంలో మార్పులు సంభవిస్తాయని కావున రైతులు పంటల ప్రణాళికపై తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. రైతులు ముందు జాగ్రత్తగా 30 రకాల విత్తనాలు కలిగిన ఫ్రీ మాన్సూన్ డ్రైసోయింగ్ కిట్లను పొలంలో వేసుకోవడం ద్వారా నేల సారవంతతను మరియు నేల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని సూచించారు.విత్తన గుళికలను తయారు చేసుకోవడం ద్వారా బెట్ట పరిస్థితులలో విత్తనాలు మొలకెత్తడానికి సులభతరం అవుతుందని తెలిపారు.రైతులు రసాయనిక ఎరువులకు బదులుగా ఘనజీవామృతం మరియు ద్రవ జీవామృతం వాడాలని వాటి తయారీ విధానాన్ని కూడా శిక్షణలో చేసి చూపించడం జరిగినది. వివిధ పంటలలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందే పద్ధతులను గురించి వివరించారు. నేలలో వివిధ రకాల మేలు కలిగించే సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుట ద్వారా నేలలో కర్బన శాతాన్ని మరియు భూ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చునని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ఇన్చార్జులు అంజనమ్మ కృష్ణవేణి, ట్రైనర్ సిసింద్రీ, వ్యవసాయ విస్తరణ అధికారి వెంకటేశ్వర్లు, వివిధ గ్రామాల రైతు సేవా కేంద్రం గ్రామ వ్యవసాయ మరియు ఉద్యాన సహాయకులు, వివిధ గ్రామాల ప్రకృతి వ్యవసాయ ఐసిఆర్పీలు పాల్గొన్నారు.