ప్రజా సమస్యలపై నిత్య పోరాటం – సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
ఖమ్మం : 28.04.2026
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం పోరాటం సాగించే పార్టీ సిపిఎం మాత్రమేనని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని సుందరయ్య భవన్లో నిర్వహించిన సిపిఎం ఖమ్మం డివిజన్ కమిటీ సమావేశం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దొంగల తిరుపతిరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలపై ప్రభావం చూపే ప్రతి సమస్యపై ముందుండి పోరాటం చేయడం కమ్యూనిస్టుల లక్షణమని, పాలకులు తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజలు మొదటగా ఆశ్రయించేది కమ్యూనిస్టు పార్టీలేనన్నారు. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే రాజకీయ శక్తిగా సిపిఎం నిలుస్తోందని ఆయన వివరించారు. ఖమ్మం నగర అభివృద్ధిలో సిపిఎం పాలన కీలక పాత్ర పోషించిందని గుర్తుచేస్తూ, మాజీ నాయకులు చిర్రావూరి లక్ష్మి నరసయ్య చేసిన సేవలను ఆయన ప్రస్తావించారు. వారి హయాంలో నిర్మించిన రహదారులు, సైడ్ డ్రైనేజీలు వంటి మౌలిక వసతులు నేటికీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు. అదే విధంగా మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన అప్రోజ్ సమీనా ఆదర్శవంతమైన పాలన అందించారని కొనియాడారు. ప్రస్తుతం ఖమ్మం నగరంలో అనేక ప్రాంతాల్లో సరైన రహదారులు, డ్రైనేజీ సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నున్నా నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక వసతుల అభివృద్ధిలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఖమ్మం నగర ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.ఈ సమావేశంలో పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీనువాసురావు, నాయకులు టి విష్ణు, MA జబ్బర్, SK మీరా సాహిబ్, బోడపట్ల సుదర్శన్, SK నాగులు మీరా, పి నాగసులోచన , కార్పొరేటర్లు యర్రా గోపి, ఎల్లంపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.