దుర్వాసనతో దడ. ఆళ్లగడ్డ బస్టాండ్లో నిలబడలేని వైనం!
AIMA న్యూస్ నంద్యాల జిల్లా.. ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలానికి ముఖద్వారమైన ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండ్ ప్రస్తుతం అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఇక్కడి టాయిలెట్ల నుండి వెలువడుతున్న విపరీతమైన దుర్వాసనతో ప్రయాణికులు 'దడ' పుట్టిస్తోంది. అసలు అది బస్టాండా లేక రోగాల నిలయమా? అని ప్రయాణికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ ప్రాంగణంలో పారిశుధ్యం అన్న మాటే వినిపించడం లేదు. ఉన్న ఒక్క టాయిలెట్ సముదాయం కంపు కొడుతున్నా, అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం దారుణం. బస్సు కోసం నిలబడాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. అహోబిలం వెళ్లే పర్యాటకులు, భక్తులు ఇక్కడి దుస్థితిని చూసి "ఇదేనా మన జిల్లా పారిశుధ్య నిర్వహణ?" అని ఈసడించుకుంటున్నారు.
కేవలం ఒక్కటే టాయిలెట్ ఉండటం వల్ల రద్దీ సమయంలో మహిళలు, వృద్ధులు పడుతున్న నరకయాతన వర్ణనాతీతం. కనీసం నీటి సౌకర్యం కూడా సరిగ్గా లేకపోవడంతో ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా మారి, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. ఇంత జరుగుతున్నా డిపో మేనేజర్ కార్యాలయంలో కూర్చుని ఏం చేస్తున్నారు? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.స్థానిక ఎమ్మెల్యే మరియు డిపో మేనేజర్ వెంటనే ఈ సమస్యపై స్పందించి, యుద్ధ ప్రాతిపదికన అదనపు టాయిలెట్లు నిర్మించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో మార్పు రావాలని, కోరుతున్నారు.