తప్పుకోబోనన్న జడ్జి- అయితే కోర్టుకు రానన్న కేజ్రివాల్...!
ఢిల్లీ మద్యం స్కాం కేసులో అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) సహా పలువురు నిందితులకు విముక్తి కల్పిస్తూ గతంలో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ హైకోర్టులో సవాల్ చేసింది.
దీంతో ఈ కేసును విచారించేందుకు సిద్ధమైన మహిళా న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మకు కేజ్రివాల్ షాకిచ్చారు. గతంలో బీజేపీ, ఆరెస్సెస్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె ఈ కేసును విచారిస్తే తనకు న్యాయం జరగదని, కాబట్టి విచారణ నుంచి తప్పుకోవాలని కోరారు. దీనికి ఆమె అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో కేజ్రివాల్ విచారణకు రాకూడదని నిర్ణయించారు.
బీజేపీ, ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న జడ్డి స్వర్ణకాంత శర్మ ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ అప్పీల్ పై విచారిస్తే తనకు న్యాయం జరగదని కేజ్రివాల్ చెప్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా వ్యక్తిగతంగా గానీ, న్యాయవాది ద్వారా గానీ కోర్టులో హాజరుకాబోనని కేజ్రివాల్ తేల్చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మకు లేఖ రాశారు. ఆ లేఖలో, న్యాయమూర్తి నుండి "న్యాయం లభిస్తుందనే ఆశ కోల్పోయానని" కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మహాత్మా గాంధీ చూపిన సత్యాగ్రహ మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన "అంతరాత్మ ప్రబోధం" విన్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఈ ఉత్తర్వుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే హక్కును వినియోగించుకుంటానని ఆయన నొక్కి చెప్పారు.
ఢిల్లీ మద్యం కేసు విచారణ నుంచి కేజ్రివాల్ కోరినట్లుగా తాను తప్పుకోబోనని జస్టిస్ స్వర్ణకాంత శర్మ తేల్చిచెప్పేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆమె విచారణ నిష్పక్షపాతంగా ఉండదనే బలమైన, సహేతుకమైన అనుమానం ఉందని కేజ్రీవాల్ తన పిటిషన్లో ఆరోపించారు.సీబీఐ ఎఫ్ఐఆర్ నుండి ఉత్పన్నమయ్యే పలు కేసులను ఆమె విన్నారని, అందులో కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కూడా ఉందని, ఏ నిందితుడికి ఆమె ఉపశమనం కల్పించలేదని కేజ్రీవాల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, కేవలం అపోహలు లేదా నిరాధారమైన అనుమానాల ఆధారంగా న్యాయమూర్తి తప్పుకోవడం సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి ప్రయత్నాలు న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు.