సింహాద్రి రాజకీయ పయనం ప్రశ్నార్ధకం? తిరిగి సొంతగూటిక? లేక జనసేన కా?
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కుసర్లపూడి గ్రామానికి చెందిన గండి సింహాద్రి 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. 1980ల్లో పార్టీలో చేరిన ఆయన, గ్రామ సర్పంచ్గా ప్రారంభించి, మండల స్థాయిలో జెడ్పీటీసీ వరకు ఎదిగారు. గ్రామ అభివృద్ధిలో ముందంజలో నిలిచి, రోడ్లు నిర్మించారు, నీటి సరఫరా మెరుగుపరిచారు, పాఠశాలలకు కొత్త భవనాలు కట్టారు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. మండలం, నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన ప్రభావం గుర్తింపు పొందింది. 'గండి సింహాద్రి చెప్పిందే వేదం, ఆయన అన్నదే జరగాలి' అనే మాటలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆయన రాజకీయ పయనం ప్రశ్నార్ధకంగా మారింది. తిరిగి సొంత తెదేపా గూటికా? లేక జనసేనలోకి మలుపా? రోలుగుంట మండలంలో గందరగోళం జోరుగా సాగుతోంది.
అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ నుంచి గండి సింహాద్రికి ఎలాంటి అధికారిక పిలుపు రాలేదు. మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు ఆయన్ని సంప్రదించకుండా పోయారు. గ్రామ సమావేశాలు, మండల కార్యక్రమాలు, నియోజకవర్గ పదవుల పంపిణీలలో ఆయన పేరు పూర్తిగా తప్పింది. తోటి నాయకులు ఆయనకు విలువనివ్వకుండా, ఏ కార్యక్రమంలోనూ పాల్గొననివ్వకుండా పక్కన పెట్టారు. ఇది స్థానిక కార్యకర్తల్లో అసహనం కలిగించింది. "42 సంవత్సరాల సేవకు ఇలా నిర్లక్ష్యం సరైనదా?" అని ప్రశ్నలు గుసగుసలాడుతున్నాయి. పార్టీలో అంతర్గత గొడవలు పెరిగాయి.
విశ్లేషకులు, స్నేహవర్గాలు బహిష్కరణ స్థానిక ఎమ్మెల్యే 'రాజు'ను కారణంగా చూపిస్తున్నారు. మహాశివరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని ఎమ్మెల్యే రాజును ముందు నుంచి ఆహ్వానించినప్పటికీ ఆయన రాకపోవడం, సింహాద్రి కార్యకర్తలకు దూరంగా ఉండటం వంటివి చూస్తుంటే సింహాద్రి వర్గాన్ని దూరం పెట్టారనే విషయం తేటతెల్లమవుతుందని స్థానికులు అంటున్నారు. దీనికి కారణం గండి సింహాద్రి ఎదురు తిరిగే తత్వం, స్వతంత్ర 'గండి సిద్ధాంతాలు' ఆయన్ని దూరం చేశాయా? ఆయన ముక్కు సూటి తనం కారణమా? ఎమ్మెల్యే వర్గాలు మండల స్థాయి నుంచి ఆయన ప్రభావాన్ని తగ్గించడానికి ఇలా బలోపేతం చేశాయా? గ్రామంలో మద్దతుదారులు "ఇది పూర్తి అంతర్గత యుద్ధం" అని చెబుతున్నారు. రాజకీయ చర్చలు రోజురోజుకూ ఉద్ధృతమవుతున్నాయి.
ఇక్కడ పెద్ద మలుపు వచ్చింది. రాజకీయ వర్గాల్లో గండి సింహాద్రి జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ మధ్య జరిగిన జనసేన సభ్యత్వ కార్యక్రమంలో సింహాద్రి వర్గం చురుకుగా పాల్గొన్నారు. ఆయన మద్దతుదారులు ఎక్కువ మంది , సభ్యత్వం తీసుకున్నారు. కొందరు "సింహాద్రి తెదేపాను వదిలి జనసేనలోకి వస్తారు. ఇది కొత్త రాజకీయ మలుపు. అని వాదిస్తున్నారు. ఇది నిజమైతే, రోలుగుంట మండల రాజకీయాలు మొత్తం మారిపోతాయి. లేక తెదేపాను భయపెట్టడానికి వ్యూహమా? ఈ ప్రశ్నలు గందరగోళాన్ని మరింత పెంచాయి.
స్థానిక నాయకులు, కార్యకర్తలు తెదేపా, జనసేన పార్టీలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సింహాద్రి రాజకీయ పయనం తిరిగి సొంత తెదేపా గూటికా? లేక జనసేనలో ప్రవేశము? సింహాద్రి రాజకీయ తీరుపై ఎమ్మెల్యే రాజు ప్రభావం ఎంత ? జనసేన సభ్యత్వం ఫైనల్ నిర్ణయమా? 42 ఏళ్ల యోధుడి భవిష్యత్తు ఎటువైపు అనేది అనకాపల్లి రాజకీయాల్లో అందరి దృష్టిలో ప్రశ్నార్ధకంగా మిగిలిపోయింది. ఏది ఏమైనాప్పటికీ సింహాద్రి పాత గూటికి వచ్చి పూర్వవైభవంతో ప్రజా సేవ చేయాలని కొందరు కార్యకర్తలు కోరగా, నూతన ఉత్తేజంతో జనసేన వైపు అడుగులు వేసి రాజకీయ జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని కొందరి కార్యకర్తలు భావిస్తున్నారు. యోధుడి రాజకీయ భవిష్యత్తుకు కాలమే తీర్పు చెప్పాలి.