ఆళ్లగడ్డలో పెట్రోల్ ఇబ్బందులు. కలెక్టర్ ప్రకటనలకు, క్షేత్రస్థాయికి పొంతన ఏది?
AIMA న్యూస్ నంద్యాల జిల్లా. ఆళ్లగడ్డ పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. గురువారం సాయంత్రం పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహన దారులు, సామాన్య ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నంద్యాల జిల్లాలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎటువంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ ఒక పక్క భరోసా ఇస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అధికారుల ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయని, బంకు యజమానులు మాత్రం కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని వాహనదారులు మండిపడుతున్నారు.పెట్రోల్ కోసం ఒక బంకు నుంచి మరో బంకుకు తిరగాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ లేదని చెబుతూ, బయట అధిక ధరలకు విక్రయించే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సకాలంలో ఇంధనం దొరక్కపోవడంతో అత్యవసర పనులు, ఆఫీసులకు వెళ్లే వారు, పండించిన పంటను తరలించాల్సిన రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఆళ్లగడ్డలోని పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేపట్టాలి. నిల్వలు ఉన్నప్పటికీ కొరత సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.