14 ఏళ్ల వైవాహిక బంధం రక్తపాతంతో ముగింపు. భార్యను హతమార్చిన భర్త.
AIMA న్యూస్ నంద్యాల జిల్లా. ఆళ్లగడ్డ పట్టణంలో గురువారం ఉదయం ఒక కిరాతక ఘటన చోటుచేసుకుంది. భార్య ప్రవర్తనపై అనుమానంతో ఆమెను కుట్టు మిషన్ కత్తెరతో గొంతుకోసి అతి దారుణంగా హత్య చేశాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆళ్లగడ్డ డీఎస్పీ ఏ. శ్రీనివాసరావు ఇవాళ సాయంత్రం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆళ్లగడ్డ తాలూకా రుద్రవరం మండలం చిత్రేనిపల్లి గ్రామానికి చెందిన బండి వెంకట కృష్ణయ్య, తన రెండో భార్య అయినటువంటి పుష్పలత తో కలిసి గత కొంతకాలంగా ఆళ్లగడ్డ పట్టణంలోని చాంద్ వీధిలో నివాసం ఉంటున్నాడు. వీరికి వివాహమై 14 ఏళ్లు కాగా, ఇద్దరు ఆడపిల్లలు (6వ తరగతి, 1వ తరగతి) ఉన్నారు.గత కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న కృష్ణయ్య, ఆమెను నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని తరుణంలో భార్యతో గొడవకు దిగాడు. ఆవేశంతో పక్కనే ఉన్న కుట్టు మిషన్ కత్తెరతో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో పుష్పలత అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ సందర్భంగా మృతురాలి తల్లి కమతం లక్ష్మి నరసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆళ్లగడ్డ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణ సి.ఐ నాగరాజు రావు ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
నిందితుడు వెంకట కృష్ణయ్యను పట్టణ శివారులోని నంద్యాల రోడ్డు లో ఉన్నటువంటి ఆంజనేయస్వామి ఆలయం వద్ద సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరం జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న సి.ఐ, ఎస్.ఐ మరియు సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.అనుమానం అనే మహమ్మారి ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడమే కాకుండా, ఇద్దరు చిన్న పిల్లలను అనాథలను చేసింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డీఎస్పీ తెలిపారు.