*పెళ్లికి నాలుగు రోజులు ముందు విషాదం… భావి వద్ద యువతి మృతదేహం.. అనుమానాస్పద మరణంపై కలకలం*
జర్నలిస్టు: మాకోటి మహేష్
మరిపెడ మండలంలో పెళ్లి జరగడానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ఒక యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన గ్రామ ప్రజల్లో ఆందోళన కలిగించడంతో పాటు పలు అనుమానాలకు తావిస్తోంది.
మరిపెడ మండలం గిరిపురం ఇటుకలగడ్డ తండాకు చెందిన భూక్యా సంగీత (19)కు, మరిపెడ మున్సిపాలిటీ కొత్త తండాకు చెందిన అజ్మీర అరవింద్తో ఈ నెల 29న వివాహం జరగాల్సి ఉంది. గతంలో ఇద్దరూ ప్రేమించుకున్నప్పటికీ, యువతి తల్లిదండ్రులు తొలుత ఈ పెళ్లికి అంగీకరించలేదని గ్రామస్తులు తెలిపారు. ఆ సమయంలో సంగీత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం.
తరువాత కుటుంబ సభ్యులు ఒప్పుకుని, అదే యువకుడితో నిశ్చితార్థం జరిపి పెళ్లి తేదీ ఖరారు చేశారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో, ఇటీవల అబ్బాయి ఇంట్లో జరిగిన శుభకార్యానికి ఇరు కుటుంబ సభ్యులు హాజరైనట్లు తెలిసింది.
అయితే మంగళవారం రాత్రి సమయంలో సంగీత, అరవింద్ బైక్పై వెళ్లినట్లు తండా వాసులు చెబుతున్నారు. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియకుండానే, బుధవారం తెల్లవారుజామున గ్రామ సమీపంలోని భావి వద్ద సంగీత మృతదేహం కనిపించడం సంచలనం సృష్టించింది. మృతదేహం సమీపంలో రక్తపు మరకలతో ఉన్న చెప్పులు కనిపించడంతో ఘటనపై అనుమానాలు మరింత పెరిగాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యువతి మృతి ఆత్మహత్యా? ప్రమాదమా? లేక మరేదైనా కారణమా? అనే విషయాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి రానున్నాయి.