logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్**ప్రపంచ ధరిత్రీ పరిరక్షణ అవగాహన దినోత్సవ కార్యక్రమం*

ది 22-04-2026: శేరిలింగంపల్లి చందానగర్: ఈరోజు ఉదయము ప్రపంచ ధరిత్రీ పరిరక్షణ దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని మసీదుబండ (కొండాపూర్)లో గల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నందు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి రజని అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ సెంటర్ ఫర్ ఎర్త్, సముద్రము, పర్యావరణ శాస్త్ర ఆచార్యులు G కిషోర్ కుమార్ గారు హాజరై విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ " *ఏప్రిల్ 22వ తేదీనాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని 1970వ సంవత్సరము నుండి ప్రతి సంవత్సరం ఒక నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం నినాదం ' _మన శక్తి - మన గ్రహం'_. సుస్థిర భవిష్యత్తు కోసం పునరుత్పాదక శక్తిని పెంచడం"* అని అన్నారు. " *ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం పర్యావరణ పరిరక్షణ మరియు వాతావరణ మార్పులపట్ల అవగాహన కల్పించడమే* " అని అన్నారు. " *ఈ కార్యక్రమం భవిష్యత్తు తరాల కోసం మన గ్రహాన్ని కాపాడుకోవటంలో మన బాధ్యతను గుర్తు చేస్తుంది. పర్యావరణ కాలుష్యం, అటవీ నిర్మూలన, అంతరించి పోతున్న పశు, పక్షాదులు, క్రిమి, కీటకాలు, సహజ వనరుల అధిక వినియోగం, పెరుగుతున్న ప్లాస్టిక్ వాడకం వలన, నదులు, చెరువులు, సముద్రాలు, భూగర్భ జలాలు కలుషితం అవడం వలన, పరిశ్రమల నుండి వెలువడే కార్బన్ ఉద్గారాల వలన, రసాయనాలు మొదలగు వాటి వలన పర్యావరణం కలుషితం అవుతూ ఉంది. మనం శ్వాసించే గాలి, త్రాగే నీరు, మన ఆహార ఉత్పత్తులను పండించే నేల మొదలగునవి మన ఆరోగ్యానికి వేరుగా లేవు. అవే మన ఆరోగ్యం* " అని అన్నారు. " *మానవుడు తన స్వార్థం కోసం పంచభూతాలైన ప్రకృతి వనరులను అభివృద్ధి పేరుతో విధ్వంసం చేయడంవలన సహజ వనరుల అధిక వినియోగం వలన ప్రకృతిలో సమతుల్యత దెబ్బతిని అతివృష్టి, అనావృష్టులు, తుఫానుల ఏర్పడుతున్నాయి. అంతే కాకుండా రసాయన పరిశ్రమల వలన, వృక్షసంపద తగ్గడం వలన, ప్లాస్టిక్ వినియోగం వలన భూతాపం పెరిగి పర్యావరణంలో విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాకుండా కలుషితమైన నీరు త్రాగడం వలన కూడా అనేక రకాల క్యాన్సర్ వ్యాధులు, చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు మొదలగు వ్యాధుల బారిన పడటం వలన మానవాళికి ఆరోగ్యనష్టంతో పాటు ఆర్థికనష్టం కూడా జరుగుతూ ఉంది. శారీరక క్రియాశీలత తగ్గిపోవడం వలన రోగనిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది. WHO నివేదికల ప్రకారం పర్యావరణ కాలుష్యం వలన క్యాన్సర్ వ్యాధులు 19% వస్తున్నాయి"* అని తెలిపారు. " *అందరికి ఆరోగ్యకరమైన, స్థిరమైన, సమానమైన మరియు సంపన్నమైన భవిష్యత్తును నిర్మించడానికి రెడ్యూస్, రీ యూజ్, రీ సైకిల్ (తగ్గించు, పునర్వినియోగం, శుద్ధిచేసి వాడటం) లాంటి చర్యల వలన పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. సహజ వనరులు పెరిగి చెత్త నిలువలు తగ్గుతాయి"* అని తెలిపారు. " *పర్యావరణ కాలుష్యం బారిన పడే వారిలో పట్టణ ప్రజలు, పరిశ్రమల కార్మికులు, రైతులు ఎక్కువగా ఉన్నారు"* అని అన్నారు. " *ఆరోగ్యమే మహాభాగ్యము కనుక మానవుడు సంపూర్ణ ఆరోగ్యవంతునిగా ఉండాలంటే విరివిగా చెట్లు నాటాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలి. అలాగే పరిశుభ్రమైన మంచినీటినే త్రాగాలి. సేంద్రీయ ఎరువులతో పండించిన ఆహార ఉత్పత్తులనే తీసుకోవాలి. ధూమపానం, మద్యపానము, మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలి. నిత్యము యోగా, వ్యాయామము చేయాలి. ప్రకృతి వనరులను పరిమితంగా వాడాలి. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, ప్రజా రవాణా వ్యవస్థలైన రైళ్ళు, బస్సులలోనే ప్రయాణించాలి. ప్రత్యామ్నాయ ఇంధన వనరులైన విద్యుత్ వాహనాలను వినియోగించాలి. సౌర, పవన, జల విద్యుత్ ఉత్పత్తులను ప్రోత్సహించడం వంటి మొదలగు చర్యలు చేపట్టి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి* " అని తెలిపారు. ఈ సందర్భంగా అందరిచేత పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపప్రాధాన అధ్యాపకులు అంబేద్కర్ అధ్యాపకులు శ్రీనివాసు, శ్రీనివాస్ గౌడ్ విద్యార్థిని, విద్యార్థులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ, వాణి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

5
2472 views

Comment