ఆర్టీసీ సమ్మె వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం - ఆ బస్సులు యధాతథం..!!
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మొదలైంది. అన్ని డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ కార్మికుల నిరసనలు హోరెత్తుతున్నాయి. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ జేఏసీ తేల్చి చెప్పింది. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యల పైన ఫోకస్ చేసింది. హైదరాబాద్ నగరంలో ప్రయివేటు సర్వీసులను అందుబాటులో ఉంచింది. సమ్మె వేళ క్యాబ్ లలో.. ఆటోలు ఇష్టానుసారం వసూలు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే ఇప్పుడు ప్రయాణీకులకు కొంత రిలీఫ్ గా కనిపిస్తోంది.తెలంగాణ వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వంతో నిన్న(మంగళవారం) జరిగిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచే బస్సులను నిలిపివేశారు.దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులు 4 వారాల సమయం కోరగా, దీనిని జేఏసీ ఖరాఖండిగా తిరస్కరించింది. ప్రభుత్వం 'ఎస్మా' ప్రయోగించి తమను భయపెట్టాలని చూస్తోందని, అయితే ఎటువంటి బెదిరింపులకు లొంగబోమని కార్మిక సంఘాలు తేల్చిచెప్పాయి. డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఈ రోజు మరోసారి కార్మిక సంఘాలతో చర్చల కు సిద్దం అవుతోంది. కాగా.. ప్రత్యామ్నాయ చర్యల పైనా ప్రభుత్వం ఫోకస్ చేసింది.