అనుమానం పెనుభూతమై--- అనాథలైన బిడ్డలు!*
*అనుమానం పెనుభూతమై....పదేళ్ల బంధం.. పగబట్టిన అనుమానం.. కన్నతల్లి కాటికి.. తండ్రి జైలుకు.. అనాథలైన బిడ్డలు!*
అన్నమయ్య జిల్లా వాల్మీకి పురంలో భర్త అనుమానం భార్య ప్రాణాన్ని బలి తీసుకుంది.
భార్యాభర్తల మధ్య తరచూ గొడవలతో భార్య హత్యకు గురి కాగా భర్త జైలు పాలు కాగా ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.
తంబళ్లపల్లి మండలం బురజుపల్లికి చెందిన డిగ్రీ చేస్తూ చదువు మానేసిన మౌనికకు వాల్మీకిపురంకు చెందిన జగదీష్ తో 2016 లో పెళ్లయింది.
10 ఏళ్ల కాపురానికి కౌశిక్(9), లోక్షిత(6) ఇద్దరు పిల్లలు ఉండగా వాల్మీకిపురం బస్టాండ్ వద్ద టీ స్టాల్ నిర్వహిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఇద్దరి మధ్య పెళ్లైన నాటి నుంచి ఉన్న గొడవలే కంటిన్యూ అవుతూ వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే వాల్మీకిపురంను వదిలి బెంగుళూరు వెళ్లిపోయారు.
యలహంకలో ఉన్న మౌనిక తండ్రి వద్దకు ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లారు.
అక్కడ మౌనిక తండ్రి కూరగాయలు వ్యాపారం చేస్తుండగా, అదే వ్యాపారం చేస్తూ ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నారు దంపతులు.
ఈ క్రమంలోనే మౌనిక – జగదీష్ల మధ్య గొడవలు మాత్రం తగ్గలేదు. అల్లుడు జగదీష్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన మౌనిక తండ్రి సుధాకర్ తమ పరువు పోతుందని వెళ్లిపోమన్నాడు.
దీంతో ఏప్రిల్ 19వ తేదీన యలహంక నుంచి తిరిగి వాల్మీకిపురం చేరుకున్న ఆ జంటకు అది ఆఖరి ప్రయాణం అవుతుందని ఎవరూ ఊహించలేదు.
సొంతూరికి వచ్చిన కొద్ది గంటలకే పాత గొడవలు మళ్లీ మొదలయ్యాయి.
సాయంత్రం 4:30 గంటల సమయంలో మాట మాట పెరిగి, కోపంతో ఊగిపోయిన జగదీష్, మౌనిక మెడలోని చున్నీతోనే ఆమె గొంతు నులిమి ప్రాణాలు తీశాడు.
కట్టుకున్న భార్యను నిర్జీవంగా మార్చాక, నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
మౌనికను హత్య చేసిన విషయం స్థానికుల నుంచి సమాచారం అందడంతో వాల్మీకిపురంకు వచ్చిన మౌలిక తల్లి ఇంట్లో విగత జీవిగా భోరున విలపించింది.
అల్లుడిని అరెస్టు చేసి న్యాయం చేయాలని కోరింది.
“అనుమానం గొంతు నులిమింది” అన్న మాట ఇక్కడ అక్షరాలా నిజమైంది.
క్షణికావేశం, అపోహలు ఒక కుటుంబాన్ని ఎలా ఛిన్నాభిన్నం చేస్తాయో చెప్పడానికి ఈ ఘటనే సాక్ష్యం.
మౌనిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చట్టం తన పని తాను చేసుకుపోతుంది కానీ, ఆ పిల్లలకి పోయిన అమ్మను, ఉన్నా లేని నాన్నను ఎవరు తిరిగి ఇవ్వగలరు?....