అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.76 లక్షల భారీ విరాళం.
AIMA న్యూస్ బ్యూరో అమరావతి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన ధర్మపత్ని, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ & ట్రస్టీ నారా భువనేశ్వరి గొప్ప మనసు చాటుకున్నారు. రాష్ట్రంలోని పేద ప్రజల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లకు ఆమె రూ. 76 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం రోజున సీఎం క్యాంప్ కార్యాలయంలో అన్న క్యాంటీన్ల సీఈవోకు విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు కేవలం తక్కువ ధరకే భోజనం అందించే కేంద్రాలు కావు. అవి ఆకలితో వచ్చే ప్రతి బిడ్డకు ఆప్యాయంగా అన్నం పెట్టే అమ్మను తలపిస్తున్నాయి. పేదవాడి ఆకలి తీర్చడమే పరమావధిగా ముఖ్యమంత్రి ఈ పథకాన్ని తిరిగి పునఃప్రారంభించారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా, రేపు ఏప్రిల్ 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని 269 అన్న క్యాంటీన్లలో పేదలకు పూర్తి ఉచితంగా భోజనం అందించాలని భువనేశ్వరి అధికారులను కోరారు. తన విరాళం ద్వారా ఆ రోజు ఎవరూ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా, అందరికీ పండుగ భోజనం వడ్డించాలని ఆమె ఆకాంక్షించారు.చంద్రబాబు నాయుడు పుట్టినరోజున ఆడంబరాలకు వెళ్లకుండా, ఆ సొమ్మును పేదల ఆకలి తీర్చడానికి వినియోగించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని కోరుకునే వారు అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వడం ద్వారా పేదల ముఖాల్లో చిరునవ్వు చూడవచ్చని భువనేశ్వరి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లన్నీ పండుగ వాతావరణంలో పేదలకు ఉచిత భోజన వితరణ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.