జూదం ఎలా జీవితాలను నాశనం చేస్తుంది? ఈ ఘటన చూడండి
బెట్టింగ్కు బానిసై… హత్యాయత్నానికీ వెనుకాడని యువకుడు
అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐ.పోలవరం మండలం వడ్డి చెరువు ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగిన మహిళపై హత్యాయత్నం స్థానికంగా కలకలం రేపింది.
స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్న పేరాబత్తుల మహాలక్ష్మి (45)పై అదే గ్రామానికి చెందిన జొన్నాడ శ్రీనివాస్ తేజ (21) కత్తితో దాడి చేశాడు. ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో దుకాణం శుభ్రం చేస్తుండగా, నిందితుడు తెలగపిండి, టైడ్ ప్యాకెట్ అడిగి లోపలికి పంపించాడు. ఆమె వస్తువులు తీసుకురావడానికి లోపలికి వెళ్లగానే కత్తితో మెడపై దాడి చేశాడు.
బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకునేలోపు నిందితుడు పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఉన్న మహాలక్ష్మిని కాకినాడ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితుడు జూదం, బెట్టింగ్లకు బానిసై భారీగా డబ్బులు కోల్పోయినట్లు తేలింది. నాలుగు రోజుల క్రితం బాధితురాలి వద్ద అబద్ధం చెప్పి బంగారు గొలుసు తీసుకుని తాకట్టు పెట్టి, ఆ డబ్బును కూడా జూదంలో పోగొట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. విషయం బయటపడుతుందని భయంతో ఆధారాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో హత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు.
నిందితుడిని అదుపులో ఉంచి విచారణ కొనసాగిస్తున్నామని, యువత జూదం, ఆన్లైన్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని సిఐ మోహన్ కుమార్ సూచించారు.