*ప్రమాద సందర్భంలో ప్రాణాలు కాపాడడంలో సిపిఆర్ కీలక భూమిక పోషిస్తుంది.*
*పత్రికా ప్రకటన*
ఆదిలాబాద్ జిల్లా,
ఏప్రిల్ 17 :-
*డయల్ 100, బ్లూ కోర్ట్, సిబ్బందికి సిపిఆర్ మరియు ఫస్ట్ ఎయిడ్ పై శిక్షణ.*
*ప్రమాదాలలో రక్షించిన వారికి కేంద్ర ప్రభుత్వం అవార్డు "రహ వీర్" తో గుర్తింపు నగదు రివార్డు.*
*ప్రమాదంలో గాయపడిన వారి ని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి చేర్చిన ఒక లక్ష యాభై వేల వరకు నగదు రహిత చికిత్స.*
*సిపిఆర్ మరియు ఫస్ట్ ఎయిడ్ శిక్షణలో స్వయంగా పాల్గొన్న జిల్లా ఎస్పి*
*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్*
“అరైవ్ అలైవ్” వారోత్సవాలలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈరోజు స్థానిక పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి అధ్యక్షతన రిమ్స్ ఆసుపత్రి నిష్ణాతులైన అనస్తేషియా వైద్యులచే డయల్ 100, బ్లూ కోర్ట్, స్పెషల్ పార్టీ, ఏ ఆర్ సిబ్బందికి సిపిఆర్ (CPR) మరియు ఫస్ట్ ఎయిడ్ పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రమాద సందర్భంలో ప్రాణాలు కాపాడడంలో సిపిఆర్ కీలక భూమిక పోషిస్తుందని, గోల్డెన్ అవర్లోపు బాధితుడికి తక్షణ వైద్య సహాయం అందిస్తే ప్రాణాలను రక్షించే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. సిపిఆర్ చేయడానికి ముందు బాధితుడు స్పృహలో ఉన్నాడో లేదో నిర్ధారించుకోవాలని, గుండె స్పందన ఆగిపోయిన సందర్భంలో మాత్రమే సిపిఆర్ నిర్వహించాలని సూచించారు. రోడ్డుపై జరిగిన ప్రమాదాలను గమనించిన వెంటనే స్పందించి బాధితులను సమీప ఆసుపత్రికి తరలించడం ప్రతి పౌరుడి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి చేర్చిన వారికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “రహ-వీర్” పథకం ద్వారా నగదు బహుమతి లభిస్తుందని, అలాగే ప్రమాద బాధితులకు సమీప ఆసుపత్రిలో ₹1.5 లక్షల వరకు క్యాష్లెస్ చికిత్స అందుబాటులో ఉంటుందని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం, హెల్మెట్ మరియు సీట్బెల్ట్ వినియోగం తప్పనిసరి చేయడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని సిపిఆర్ మరియు ఫస్ట్ ఎయిడ్ శిక్షణలో పాల్గొనడం జరిగింది. అధికారులు, సిబ్బందికి ప్రతి ఒక్కరికి శిక్షణను అందించి ప్రాణాపాయ సమయంలో రక్షించేలా సంసిద్ధం కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పరిపాలన పి మౌనిక, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు, ఆర్ ఐ లు, రిజర్వ్ సిబ్బంది రిమ్స్ వైద్యులు అనస్థీషియా డా శ్యామ్ సుందర్, డా గంగాధర్, డా వివేక్, 108 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.