ఆళ్లగడ్డలో అంబరాన్నంటిన అంబేద్కర్ జయంతి వేడుకలు.
AIMA న్యూస్ నంద్యాల జిల్లా.భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఆళ్లగడ్డ పట్టణంలో మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. కులమతాలకు అతీతంగా, సమానత్వమే ధ్యేయంగా సాగిన ఈ వేడుకలు పట్టణంలో పండుగ వాతావరణాన్ని తలపించాయి.
స్థానిక తహశీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి పట్టణ ఎస్సై చిన్న పీరయ్య, మున్సిపల్ కమిషనర్ కిషోర్ మరియు ఇతర అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. దేశం నేడు అనుభవిస్తున్న స్వేచ్ఛా ఫలాలు, హక్కులు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే సాధ్యమయ్యాయని కొనియాడారు.
అనంతరం ఎమ్మార్వో కార్యాలయం నుండి పాత బస్టాండ్ నాలుగు రోడ్ల సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘జై భీమ్’ నినాదాలతో పట్టణ వీధులు మారుమోగాయి. పాత బస్టాండ్, నాలుగు రోడ్ల సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి నాయకులు, అధికారులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశ గమనాన్ని మార్చిన గొప్ప మేధావి అంబేద్కర్ అని, ఆయన అందించిన రాజ్యాంగం దేశానికి ఒక దిక్సూచి లాంటిదని పేర్కొన్నారు.
చదువుతోనే సాధికారత శిక్షించు, పోరాడు, సంఘటించు అన్న బాబాసాహెబ్ పిలుపును స్ఫూర్తిగా తీసుకుని, బహుజన బిడ్డలు ఉన్నత చదువులు చదివి అభివృద్ధి చెందాలని వారు పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా అందరూ సమానంగా జీవించాలన్న ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, యువత మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.