ఆళ్లగడ్డ మండలం.బత్తలూరు గ్రామం లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం. భారీగా ఆస్తి నష్టం.
AIMA న్యూస్ నంద్యాల జిల్లా. ఆళ్లగడ్డ మండలం బత్తలూరు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రైతులు దాచుకున్న నిల్వలు అగ్నికి ఆహుతై కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా.గ్రామంలోని మారెమ్మ గుడి సమీపంలో నిల్వ ఉంచిన భారీ గడ్డి వాముల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి వేళ మంటలు ఎగిసిపడటంతో పాటు దట్టమైన పొగ కమ్మేయడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించాయి.
గడ్డి వాముల నుండి మంటలు గ్రామంలోని నివాస గృహాలకు ఎక్కడ వ్యాపిస్తాయోనని ప్రజలు నిద్రలేని రాత్రి గడుపుతున్నారు. స్థానికులు తమ శక్తి మేరకు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ, ప్రమాద తీవ్రత దృష్ట్యా అది సాధ్యపడలేదు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్తో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, మంటల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల అవి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. సిబ్బంది సమయంతో పోటీ పడుతూ మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ప్రమాదంలో కోట్లలో నష్టం వాటిల్లిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఎంతో కష్టపడి నిల్వ చేసుకున్న పశుగ్రాసం, ఇతర సామగ్రి క్షణాల్లో బూడిదవ్వడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.