భార్య హత్య కేసులో జీవిత ఖైదు
కొత్తగూడెం లీగల్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ శుక్రవారం ఒక భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించారు.
కేసు వివరాలు:
టేకులపల్లి మండలం కొత్త తండాకు చెందిన భానోత్ ఈశ్వర్ 2020 డిసెంబర్ 4 న టేకులపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన అక్క గుగ్లోత్ మంగను 16 సంవత్సరాల క్రితం టేకులపల్లి మండలం హనుమతండాకు చెందిన గుగ్లోత్ భాస్కర్కు వివాహం చేసారని తెలిపారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వివాహం తరువాత భాస్కర్ మద్యానికి అలవాటు పడి భార్యను తరచూ కొట్టడం, దుర్భాషలాడడం, అనుమానించడం వంటి వేధింపులకు గురి చేసేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామ పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు జరిగినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.
2020 డిసెంబర్ 2న మంగ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో టేకులపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
పోలీసుల దర్యాప్తులో, భాస్కర్ తన సోదరుడు నరేందర్తో కలిసి ముందుగా పథకం రచించి, ఇంట్లో ఒంటరిగా ఉన్న తన భార్యను చీరతో గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని ఇల్లందు-ఖమ్మం రోడ్డులో శాంతినగర్ సమీపంలోని బావిలో పడేసినట్టు తేలింది.
ఈ కేసులో నిందితుడు గుగ్లోత్ భాస్కర్ 2020 డిసెంబర్ 13న పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నరేందర్ పరారీలో ఉండగా, తరువాత అతనిపై సరైన సాక్ష్యాలు లభించలేదు.
కోర్టు తీర్పు:
కోర్టు 18 మంది సాక్షులను విచారించిన అనంతరం:
గుగ్లోత్ భాస్కర్పై హత్య నేరం (IPC 302) రుజువు కావడంతో జీవిత ఖైదు మరియు ₹1000 జరిమానా విధించింది.
సాక్ష్యాలను నాశనం చేసిన నేరం (IPC 201) కింద 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు ₹1000 జరిమానా విధించింది.
మొత్తం ₹2000 జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
అయితే, గుగ్లోత్ నరేందర్పై నేరం రుజువు కాలేదని కోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి. లక్ష్మి వాదించారు. కోర్టు నోడల్ ఆఫీసర్ జి. రాఘవయ్య, లైజన్ ఆఫీసర్ ఎన్. వీరబాబు (కోర్టు డ్యూటీ ఆఫీసర్), పి.సి.ఎల్. వీరలాల్ సహకరించారు.