చెవి పూర్తిగా వేరైన రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స – కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం
భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని ఈఎన్టి విభాగం వైద్యులు మరోసారి తమ నైపుణ్యాన్ని చాటుతూ ఒక క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
చుంచుపల్లి మండలం రామవరం గ్రామానికి చెందిన నిర్మల (40), భర్త రాయమల్లు, 09-04-2026న తీవ్రమైన గాయంతో ఆసుపత్రిలో చేరారు. ఆమెకు Grade-4 traumatic avulsion of pinna (చెవి భాగం పూర్తిగా వేరైపోవడం) అనే అరుదైన మరియు ప్రమాదకర పరిస్థితి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ క్లిష్ట పరిస్థితిని సవాల్గా తీసుకున్న ఈఎన్టి విభాగం వైద్య బృందం అత్యంత జాగ్రత్తగా, నైపుణ్యంతో శస్త్రచికిత్స నిర్వహించి చెవి భాగాన్ని పునఃస్థాపన చేయడంలో విజయాన్ని సాధించింది. శస్త్రచికిత్సకు ముందు మరియు అనంతరం పరిస్థితులు కేసు తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉండి, వైద్యుల పర్యవేక్షణలో మెరుగుదల దిశగా ఉంది.
ఈ శస్త్రచికిత్సను డాక్టర్ శాంసన్ ఆధ్వర్యంలో ఈఎన్టి వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఈఎన్టి ఫ్యాకల్టీ, అనస్థీషియా విభాగం వైద్యులు, ఆపరేషన్ థియేటర్ నర్సింగ్ సిబ్బంది మరియు టెక్నీషియన్లు సమిష్టిగా చేసిన కృషి ప్రశంసనీయం.
ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఈ విజయవంతమైన శస్త్రచికిత్స మరోసారి రుజువు చేసింది.