జర్నలిస్టుల మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతం.
నంద్యాల (AIMA MEDIA ): మంగళవారం నంద్యాల పట్టణంలోని గాంధీనగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు ఈ శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం శిబిరాన్ని పరిశీలించిన కలెక్టర్, అక్కడి ఏర్పాట్లపై డీఎంహెచ్ఓను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఆరోగ్యంపై అవగాహన పెంపు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా జర్నలిస్టులు ఎప్పటికప్పుడు తీరిక లేని జీవితాన్ని గడుపుతున్నందున, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ఈ ఉచిత ఆరోగ్య తనిఖీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ముఖ్యంగా “ప్రివెంటివ్ హెల్త్ కేర్” (ముందస్తు ఆరోగ్య సంరక్షణ)పై అవగాహన పెంపు చాలా కీలకమని, మీడియా మిత్రులకు సరైన ఆరోగ్య జ్ఞానం ఉంటే అది సమాజంలో విస్తృత స్థాయిలో ప్రజలకు చేరుతుందని అన్నారు. అందువల్ల మీడియా ప్రతినిధులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.ఈ శిబిరంలో రక్తపరీక్షల అనంతరం నిపుణ వైద్యులు జర్నలిస్టులకు ఆరోగ్య సలహాలు అందించడంతో పాటు అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు.జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఉచిత వైద్య సేవలు అందించడం విశేషం.ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా. వెంకటరమణ, డీసీహెచ్ఎస్ డా. లలిత, గైనకాలజిస్టులు డా. అనూష, డా. అయేషా, పీడియాట్రిషన్ డా. అనిత, సైకియాట్రిస్ట్ డా. శరత్ చంద్ర, జనరల్ మెడిసిన్ వైద్యులు డా. ప్రియాంక, డా. శైలజ, కార్డియాలజిస్ట్ డా. క్రాంతి, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు డా. ప్రసన్న లక్ష్మీ, డా. శ్రీజ, డా. కాంతారావు నాయక్, వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారులు, సమాచార పౌరసంబంధాల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.