ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్*
ప్రపంచ ఆరోగ్య దినోత్సవ అవగాహన కార్యక్రమం సందర్భంగా ఉచిత దంత వైద్య శిబిరం.......
తేదీ: 07-04-2026, శేరి లింగంపల్లి చందానగర్:ప్రపంచ ఆరోగ్య అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని తారానగర్ వీకర్ సెక్షన్ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలనందు స్మిత దంత వైద్యశాల, చందానగర్ వారి సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరము నిర్వహించడం జరిగింది. స్మిత దంత వైద్యశాల నిర్వాహకులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి మరియు డాక్టర్ స్వాతి, డాక్టర్ భువన దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, టూత్ పేస్టులు మరియు బ్రష్ లు అందరికి అందజేసి తదనంతరం వైద్యులు మాట్లాడుతూ " *ప్రతి ఒక్కరూ ఉదయము మరియు రాత్రి నిద్ర పోయేముందు రెండుపూటలా తప్పనిసరిగా బ్రష్ చేసుకోవాలి"* అని అన్నారు. " *మనం ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే నీటితో నోటిని బాగా పుక్కిలించి శుభ్రం చేసుకోవాలి. దంత సమస్యలు ఉన్న యెడల అశ్రద్ధ చేయకుండా దంత వైద్యుని సంప్రదించి వారి సూచనలు, సలహాలు పాటించి దంతాలను సంరక్షించుకోవాలి. లేనియెడల మనం తీసుకునే ఆహారాన్ని పూర్తిగా నమలలేక పోవడం వలన అజీర్తితో ఉదరకోశ వ్యాధులతో పాటు లివరు, కిడ్నీ, గుండెజబ్బులు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి* " అని అన్నారు. " *కావున దంత సంరక్షణ పట్ల అశ్రద్ధ కూడదు"* అని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ " *ఈరోజు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆవిర్భావ దినోత్సవమం. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా WHO వారు అనేక అవేర్ నెస్ కార్యక్రమాలు ఒక ప్రత్యేక నినాదంతో నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం నినాదం 'ఆరోగ్యంకోసం విజ్ఞానంతో కలిసి నిలబడదాం'. ప్రజలలో ఆరోగ్య సమస్యలపై అవగాహన కలిగించడం, మంచి ఆహార అలవాట్లు, వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించేలా చైతన్య పరచడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆరోగ్యహక్కు ప్రాథమిక మానవహక్కు. ప్రతి ఒక్కరికీ అవసరమైనప్పుడు ఆర్థికభారం లేకుండా ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండాలి. ప్రపంచ జనాభాలో 30% మందికి ప్రాథమిక ఆరోగ్య చికిత్సలు అందుబాటులో లేవు. మానవుడు సంపూర్ణ ఆరోగ్య వంతునిగా ఉన్నప్పుడే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాడు. మన ఆరోగ్యం మన చేతులలో ఉండాలంటే నిత్య వ్యాయామం 40 నిమిషాలు చేయాలి. మానసిక ప్రశాంతత కొరకు ధ్యానం చేయాలి. తాజా ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం తీసుకోవాలి. తృణధాన్యాలు, పాలు, పాల ఉత్పత్తులు, చాపలు, గ్రుడ్లు వంటివి తీసుకోవడంతో పాటు మీరు తినే ఆహారంలో ఎక్కువగా పీచు పదార్థాలు కలిగిన ఆహారాన్నే తీసుకోవాలి* " అని చెప్పారు. " *భోజనము తీసుకోవడానికి సమయ పాలన పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అందుకనే మన పూర్వీకులు _ఆరోగ్యమే మహా భాగ్యము_ అని అన్నారు* " అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రాజశేఖర్, అధ్యాపకులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.