పని చేసే వాడికి పదవి లేదు.పదవి ఉన్న వాడికి పని లేదు. జనసేనలో వింత పరిస్థితి.
AIMA న్యూస్ బ్యూరో అనంతపురం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పదవిలో భాగంగా జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా, నమ్మకంతో అప్పగించిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ రాష్ట్ర డైరెక్టర్ పదవికి స్థానిక అనంతపురానికి చెందిన పడుచూరి భవాని రవికుమార్ న్యాయం చేస్తున్నారా? అంటే క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాధానం పెద్ద సున్నా. రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య వ్యవస్థను పరుగులు పెట్టించాల్సిన వ్యక్తి, కేవలం తన సొంత నియోజకవర్గానికే పరిమితమైపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్ర స్థాయి డైరెక్టర్ అంటే అన్ని జిల్లాల బాధ్యత భుజాన ఉండాలి. కానీ, భవాని రవికుమార్ మాత్రం డైరెక్టర్ హోదాను కేవలం తన నియోజకవర్గ అనంతపురం ప్రచారానికి ఒక కవచంలా వాడుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన చెత్త సమస్యలు పట్టవు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపాలు కనబడవు.కానీ, సొంత ఇలాకాలో మాత్రం ఫొటోలకు ఫోజులిస్తూ కాలక్షేపం చేస్తున్నారనేది జనసేన కార్యకర్తల ఆవేదన.కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి దక్కిన కీలక పదవుల్లో ఇదీ ఒకటి. పవన్ కళ్యాణ్ ఆశించిన క్లీన్ ఆంధ్రప్రదేశ్' లక్ష్యం నెరవేరాలంటే డైరెక్టర్ స్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉండాలి. అయితే, రవికుమార్ రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేయడం కానీ, జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించడం కానీ ఎక్కడా కనిపించడం లేదు. ఆయన దృష్టి అంతా తన రాజకీయ భవిష్యత్తుపైనే తప్ప, అప్పగించిన బాధ్యతపై లేదని స్పష్టమవుతోంది.రాష్ట్ర డైరెక్టర్ అంటే కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితమా? అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పదవి ఇచ్చినందుకు పార్టీకి కృతజ్ఞతగా రాష్ట్రవ్యాప్తంగా మార్పు తీసుకురావాల్సింది పోయి, కేవలం స్థానిక రాజకీయాలకే అంకితమైతే. ఈ పదవికి ఉన్న గౌరవం ఏం కావాలి.పార్టీ జెండా మోసి, లాఠీ దెబ్బలు తిన్న కరుడుగట్టిన కార్యకర్తలు ఇప్పటికీ గుర్తింపు కోసం వేచి చూస్తుంటే, అదృష్టవశాత్తూ పదవులు దక్కించుకున్న వారు ఏసీ గదులకే పరిమితమవ్వడం దారుణం. ఇప్పటికైనా భవాని రవికుమార్ తన స్థానిక మోహం వీడి, రాష్ట్ర డైరెక్టర్గా మేల్కొంటారా? లేక ఇలాగే కాలయాపన చేస్తూ జనసేన ప్రతిష్టను మసకబారుస్తారా? అనేది వేచి చూడాలి.