సత్తుపల్లి పురపాలక సంఘంలో ఏసీబీ దాడులు.. పన్నుల వసూళ్లలో భారీ అక్రమాలు
సత్తుపల్లి పురపాలక సంఘంలో ఏసీబీ దాడులు.. పన్నుల వసూళ్లలో భారీ అక్రమాలు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పురపాలక సంఘం కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పలు అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. మార్చి 31న జరిగిన ఈ సోదాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పన్నుల వసూళ్లలో తీవ్ర నిర్లక్ష్యం జరిగినట్లు గుర్తించారు. మొత్తం రూ.22.23 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా, కేవలం రూ.7.99 కోట్లు మాత్రమే వసూలు చేసి ఏకంగా రూ.14.23 కోట్లు బకాయిలు పెట్టినట్లు నిర్ధారించారు. సిబ్బంది చరవాణులను పరిశీలించగా పన్నుల వసూలు బాధ్యతలు చూసే నాగుబండి నరసింహారావు, కార్యాలయ నిర్వాహకుడు ఎం.శ్రీనివాస్ తదితరుల మధ్య అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. రికార్డుల నిర్వహణలోనూ అనేక లోపాలున్నాయని, పూర్తిస్థాయి విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యల కోసం ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని అధికారులు తెలిపారు. అవినీతి అధికారులపై 1064 ఉచిత సహాయవాణికి ఫిర్యాదు చేయాలని సూచించారు.