గ్రామ/వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించాలి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
కామారెడ్డి జిల్లా
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామసభలు, వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు.
మంగళవారం హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ శాఖల కార్యదర్శులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో గ్రామసభలు/వార్డు సభల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏప్రిల్ 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు, వార్డు సభలను ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని తెలిపారు. సభలను తెలంగాణ గీతంతో ప్రారంభించి, ప్రారంభ ప్రసంగం అనంతరం ముఖ్యమంత్రి సందేశం వినిపించాలని సూచించారు.
సభలలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా రైతు భరోసా, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ వంటి పథకాల లబ్ధిదారుల వివరాలను వెల్లడించాలని, అర్హులైన వారికి పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జూన్ 2 నుండి ప్రారంభించనున్న ఇందిరమ్మ కుటుంబ జీవితం భీమా పథకం, ప్రభుత్వ పాఠశాలలలో అల్పాహార, మధ్యాహ్న భోజన పథకాల పై ప్రజలకు వివరించాలని తెలిపారు. సాంస్కృతిక శాఖ ద్వారా కళాకారులతో ప్రచారం చేపట్టాలని సూచించారు .. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మాట్లాడుతూ గ్రామసభలు, వార్డు సభలను SOPs ప్రకారం కచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
పథకాల అమలుపై లబ్ధిదారుల అభిప్రాయాలను సేకరించి, వాటి ప్రభావాన్ని అంచనా వేయాలని తెలిపారు.
పన్ను వసూళ్లలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని సన్మానించాలని ఏప్రిల్ 6 నుండి “హెల్త్ వీక్” నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ గ్రామసభలు, వార్డు సభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. సభల ప్రాంగణాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాట్లు , తదితర సదుపాయాలు కల్పించి గ్రామ సభలను విజయవంతం చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్ ,వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.