ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి.
ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయాలి
జిల్లా కలెక్టర్ రాజర్షి షా
పత్రికా ప్రకటన
మార్చి 30, 2026 – ఆదిలాబాద్
జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. ప్రజావాణి పోర్టల్లో నమోదయ్యే ప్రజా ఫిర్యాదులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించడం అధికారుల ప్రాధాన్య కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సామాజిక భద్రతా పెన్షన్లు, ఉపాధి హామీ పనులు, భూభారతి సమస్యలు తదితర అంశాలకు సంబంధించి మొత్తం 101 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. వీటిపై తక్షణ చర్యలు తీసుకుని, సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి ద్వారా అందే ప్రతి ఫిర్యాదును 30 రోజుల్లోపు పరిష్కరించాలని స్పష్టం చేశారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి, సమస్యలపై తీసుకున్న చర్యల నివేదికలను సమయానికి పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు.
పదేపదే ఒకే సమస్యపై ఫిర్యాదులు రావడం జరుగకుండా శాశ్వత పరిష్కారాలపై దృష్టి సారించాలని, అప్పీల్ కేసులను రెండు నుంచి మూడు రోజుల్లోనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీవో స్రవంతి, డీఆర్డీవో రవీందర్, డివైఎస్ఓ శ్రీనివాస్, డీఏండబ్ల్యూఓ కలీం, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.