జనగణన పకడ్బందీగా జరగాలి
జిల్లా కలెక్టర్ రాజర్షి షా
పత్రికా ప్రకటన
మార్చి 30, 2026 – ఆదిలాబాద్
దేశ భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు, సంక్షేమ పథకాల అమలుకు జనగణన అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ‘జనగణన నుండి జన కల్యాణం’ అనే నినాదంతో ఈ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
స్థానిక టీటీడీసీలో శనివారం ప్రారంభమై సోమవారంతో ముగిసిన ‘సెన్సస్-2027’ ఫీల్డ్ ట్రైనర్ల మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో కలెక్టర్ పాల్గొని ట్రైనర్లకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ గణనలో ప్రతి వ్యక్తి వివరాలు ఖచ్చితంగా నమోదు కావాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇళ్ల జాబితా తయారీ, గృహ గణన సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో గణన నిర్వహించే సిబ్బందికి ఫీల్డ్ ట్రైనర్లు సమగ్ర అవగాహన కల్పించాలని అన్నారు.
డిజిటల్ విధానంలో నిర్వహించనున్న ఈ ప్రక్రియలో సాంకేతిక అంశాలపై పూర్తి పట్టు సాధించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ట్రైనింగ్ కలెక్టర్ సలోని చాబ్రా, పర్యవేక్షకులు నలంద ప్రియ, మాస్టర్ ట్రైనర్లు కె. శ్రీహరి బాబు, యువరాజ్, సంబంధిత విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.