ఆళ్లగడ్డలో స్వచ్ఛ విప్లవం. రంగంలోకి దిగిన మున్సిపల్, రెవెన్యూ అధికారులు
AIMA న్యూస్ నంద్యాల జిల్లా. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఆళ్లగడ్డ పట్టణ మున్సిపల్ కార్యాలయం మరియు ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో అధికారులు స్వయంగా చీపురు పట్టి చెత్తను తొలగించి, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.మున్సిపల్ కమిషనర్ కిషోర్ ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆళ్లగడ్డను స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఈ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.
మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న మెప్మా ఆర్పీలకు ఇంట్లో వచ్చే తడి వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువును తయారు చేసుకునేందుకు అవసరమైన బిన్లను కమిషనర్ పంపిణీ చేశారు. చెత్తను రోడ్లపై వేయకుండా, ఇంటి వద్దనే ఎరువుగా మార్చుకోవడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని ఆయన సూచించారు. అనంతరం, ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో తహశీల్దార్ జ్యోతి రత్నకుమారి స్వయంగా పారిశుధ్య పనుల్లో పాల్గొన్నారు. సిబ్బందితో కలిసి కార్యాలయ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.