పంచాయతీ ఓటర్ల జాబితాలో తరచూ మార్పులు కుదరదు*
*పంచాయతీ ఓటర్ల జాబితాలో తరచూ మార్పులు కుదరదు*
*🔶ఈసీఐ ధ్రువీకరించిన జాబితానే ప్రామాణికం*
*🔷దీనికనుగుణంగా రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు*
*🔶నేడు శాసనసభలో ప్రభుత్వ బిల్లు*
*🍥రాష్ట్రంలో ఇకపై గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాలో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు ఉండవు. సంబంధిత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు సవరణలకు వీలుండదు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించే తుది జాబితాను ప్రామాణికంగా తీసుకునే పంచాయతీ ఓటర్ల జాబితాలను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. తెలంగాణ పంచాయతీరాజ్(మూడో సవరణ) బిల్లు-2026ని మంత్రి సీతక్క శనివారం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం-2018ని అనుసరించి గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ వచ్చే నాటికి ఆయా గ్రామాల్లోని ఓటర్లను నమోదు చేసి, ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలి. ఇదే విధానాన్ని చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పాటిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు అందుబాటులో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు ఓటర్ల జాబితాను రూపొందించడంతోపాటు జాబితాలో మార్పులు, చేర్పులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల ఎన్నికల సంఘాలకు ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక సర్క్యులర్ పంపింది. దీని ప్రకారం... రాష్ట్ర ఎన్నికల సంఘాలు స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన ఓటర్ల జాబితా కోసం 60 రోజుల ముందు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయాలి. దాన్ని పరిగణనలోనికి తీసుకొని ఈసీఐ రాష్ట్రాలకు తాము ప్రచురించిన ఓటర్ల జాబితాను అధికారికంగా పంపిస్తుంది. ఆ జాబితాలో ఉన్న పేర్లను మాత్రమే గ్రామపంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాలో చేర్చి, ఎన్నికలను నిర్వహించాలి. ఈసీఐ ఆదేశాలను విధిగా అమలు చేయాల్సి ఉన్నందున... రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్ట సవరణకు నిర్ణయించింది. ఇది ఆమోదం పొంది అమల్లోకి వస్తే ఈసీఐ రాష్ట్రానికి పంపించే జాబితాలో ఉన్న పేర్ల ఆధారంగానే గ్రామాల్లో ఓటర్ల జాబితాను రూపొందించి, పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాను రూపొందిస్తారు. దాని ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారు.*