ఇన్స్టాగ్రామ్ పరిచయం… ప్రేమగా మారింది… చివరికి విషాదాంతం!
ఇన్స్టాగ్రామ్ పరిచయం… ప్రేమగా మారింది… చివరికి విషాదాంతం!
సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన ఇద్దరి జీవితం… చివరకు కన్నీటి కథగా మారింది. ఏలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన హృదయాలను కలిచివేస్తోంది.
ఉంగుటూరు మండలం యర్రమళ్లకు చెందిన చిన మావుళ్లయ్య (25) చేపల ప్యాకింగ్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా శ్రీకాకుళం జిల్లా సింగుపురానికి చెందిన వివాహిత ఇర్రి రమ (34)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది.
ఇద్దరూ కుటుంబాలకు చెప్పకుండా వివాహం చేసుకున్నారు. అయితే రమకు ఇప్పటికే పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉండటం… ఈ విషయం బయటపడడంతో ఇరువైపులా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రమ కుటుంబ సభ్యులు వచ్చి గొడవ చేసి ఆమెను తిరిగి సింగుపురానికి తీసుకెళ్లారు.
అయితే ప్రేమను వదిలిపెట్టలేక… ఇద్దరూ మళ్లీ కలుసుకున్నారు. చివరిసారిగా తన అన్న కుమారుడికి ఫోన్ చేసి “రమ వచ్చింది… రేపు మాట్లాడుకుందాం” అని చెప్పిన చిన మావుళ్లయ్య… ఆ తర్వాత కనిపించకుండా పోయాడు.
కాలువ గట్టున అతడి వస్తువులు కనిపించడంతో అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాలింపు చర్యల్లో చిన మావుళ్లయ్య మృతదేహం లభించగా… అనంతరం రమ మృతదేహం కూడా కాలువలోనే బయటపడింది.
ఈ ఘటనతో ఒక కుటుంబానికి కొడుకు దూరమయ్యాడు… మరో కుటుంబానికి తల్లి కోల్పోయిన ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ప్రేమ పేరుతో తీసుకున్న ఆవేశ నిర్ణయం… రెండు కుటుంబాల్లో ఎప్పటికీ మాయని గాయం మిగిల్చింది.
👉 సోషల్ మీడియా పరిచయాలు జీవితాలను మార్చగలవు… కానీ నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి ఆలోచించడం ఎంతో ముఖ్యం.