ఈనెల 28న రుద్రవరం మేజర్ పంచాయతీ సంత మార్కెట్, దిన మరియు కబేల మార్కెట్ వేలంపాటలు.
నంద్యాల జిల్లా రుద్రవరం మేజర్ పంచాయతీ సంత మార్కెట్, దిన మార్కెట్ మరియు కబేల మార్కెట్ వేలం పాటలు ఈనెల 28వ తేదీన నిర్వహించనున్నట్లు ఇంచార్జీ ఈవో వడ్డేరామకృష్ణ గురువారం నాడు స్థానిక సచివాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు, సర్పంచ్ బైరి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ వేలం ప్రక్రియ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది వేలం పాటలను గతంతో పోలిస్తే 10 శాతం అదనంగా పెంచి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. పెంచిన మొత్తాల ప్రకారం వారపు సంత మార్కెట్ను రూ 9,19,600 రూపాయలతో దిన మార్కెట్ను 4,20,200 రూపాయలతో కబేలా మార్కెట్ 9,350 రూపాయలతో పాట ప్రారంభమవుతుందని వివరించారు. ఈ వేలంలో పాల్గొనేవారు తప్పనిసరిగా రుద్రవరం గ్రామ నివాసులై ఉండాలని, సంత మార్కెట్కు రూ 1
లక్ష రూపాయలు, దిన మార్కెట్కు రూ 50 వేలు, కబేల మార్కెట్ కు రూ10 వేల రూపాయలు ధరావత్తు చెల్లించాలని సూచించారు. అత్యధిక పాట దక్కించుకున్న వారు 7 రోజుల్లోపు పూర్తి మొత్తాన్ని గ్రామ పంచాయతీలో జమ చేయాలని, గడువులోగా చెల్లించని పక్షంలో వేలం రద్దు చేసి తిరిగి నిర్వహించబడుతుందని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ఆదాయాన్ని పెంచి వేసవిలో తాగునీరు, విద్యుత్ దీపాలు మరియు ఇతర పారిశుధ్య పనుల నిర్వహణకు గ్రామస్తులు, వ్యాపారులు సహకరించాలని ఆయన కోరారు.