నేను సెలబ్రిటీని, నన్నెవడ్రా ఆపేది.. మద్యం మత్తులో లావణ్య హంగామా!
సంగారెడ్డి జిల్లాలో మద్యం మత్తులో హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య చేసిన హంగామా సంచలనంగా మారింది.
బుధవారం కొండాపూర్ మండలం మల్లెపల్లి గ్రామం వద్ద జరిగిన ఘటనలో ఆమె కారుతో ఒక బైక్ను ఢీకొట్టడం, అనంతరం గ్రామస్థులతో వాగ్వాదానికి దిగడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే లావణ్యపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు.
లావణ్య కారులో బీరు బాటిళ్లను పోలీసులు గుర్తించారు. ఆమెకు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో 140 పాయింట్లు నమోదవ్వడంతో మద్యం సేవించి వాహనం నడిపినట్లు నిర్ధారణ అయింది. దీంతో కొండాపూర్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్కి తరలించారు. గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నారు. ఈ కేసులో భాగంగా ఈ రోజు కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. లావణ్య గైర్హాజరయింది.
లావణ్య మల్లేపల్లి వద్ద ఎదురుగా వస్తున్న ఓ బైక్ను తన కారుతో ఢీకొట్టింది. ఆపై పారిపోయే ప్రయత్నం చేయగా.. గ్రామస్థులు అడ్డుకున్నారు. సారీ చెప్పాలని గ్రామస్థులు కోరగా.. వారితో లావణ్య వాగ్వాదానికి దిగింది. ‘నేను ఎవరో తెలుసా?’ అంటూ తిరిగింది. తాను సెలబ్రిటీనని, తనను ఆపే హక్కు ఎవరికీ లేదంటూ హెచ్చరించారని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయ నాయకులతో తనకు పరిచయాలు ఉన్నాయని చెప్పి బెదిరింపులకు కూడా దిగింది. తన కారును అడ్డుకుంటే కేసులు పెట్టి జైలుకు పంపిస్తానని లావణ్య గ్రామస్థులను భయపెట్టింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా ప్రవర్తించినలావణ్య తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.