అట్టహాసంగా 'మహిళా మార్ట్' ప్రారంభం:జిల్లా కలెక్టర్ రాజర్షిషా
పత్రిక ప్రకటన
మార్చి 25, 2026_ఆదిలాబాదు:
మహిళా సాధికారత దిశగా అదిలాబాద్ జిల్లా మరో ముందడుగు వేసిందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బుధవారం జిల్లా మహిళా సమాఖ్య, సెర్ప్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన అదిలాబాద్ మహిళా మార్ట్' ప్రారంభోత్సవానికి మునిసిపల్ చైర్ పర్సన్ బండారి అనూషతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని మహిళా సంఘాలు తయారు చేస్తున్న సుమారు 30 రకాలకు పైగా నాణ్యమైన ఉత్పత్తులు ఈ మార్ట్లో లభ్యమవుతాయని తెలిపారు. పట్టణ నడిబొడ్డున, ప్రధాన రహదారి పక్కనే ఈ మార్ట్ను ఏర్పాటు చేయడం వల్ల వినియోగదారులకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన వస్తువులు నేరుగా అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆదివాసీలు తయారు చేసే ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులకు, అటవీ ఉత్పత్తులకు ఇక్కడ ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. 'మేడ్ ఇన్ అదిలాబాద్ - ఫర్ అదిలాబాద్' అనే నినాదంతో ప్రారంభమైన ఈ మార్ట్, భవిష్యత్తులో హైదరాబాద్లోని ఐఎంఎస్ బజార్ తరహాలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.
అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ, జిల్లాలో మహిళా సంఘాల ద్వారా తయారైన ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ వినూత్న విక్రయ కేంద్రాన్ని అందుబాటులోకి తెలిపారు. కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా మహిళలు వ్యాపార రంగంలోనూ రాణించడం గర్వకారణమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డీఓరవీందర్, వార్డ్ కౌన్సిలర్ కలాల శ్రీనివాస్, మహిళా సమైఖ్య సభ్యులు లక్ష్మి, బృందన, మంజుల, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.